Revanth Reddy | పార్టీల గేట్లు ఎత్తుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. నువ్వు గేట్లు ఎత్తి రాజకీయాలు చేస్తే.. కరెంటు సంగతి ఎవరు చూడాలని మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. కమీషన్ల కోసం ప్రైవేటుసంస్థల నుంచి విద్యుత్ కొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.
విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణ వాటా కింద ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ నిర్మించి.. ఇందులో 85 శాతం వాడుకునేందుకు వీలు ఉందని లక్ష్మణ్ చెప్పారు. ఇప్పటికే 1600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి మొదలవ్వగా.. మిగతా యూనిట్లకు సంబంధించి ఎన్టీపీసీ వరుసగా లేఖలు రాస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలోనే ఎన్టీపీసీ రెండుసార్లు లేఖలు రాసిందని.. అయినా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే ఆ విద్యుత్ను వేరే రాష్ట్రానికి మళ్లిస్తామని ఎన్టీపీసీ హెచ్చరికలు చేస్తుందని చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కమీషన్లు రావనే ఉద్దేశంతోనే ఎన్టీపీసీ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. వంద రోజులుగా సీఎం హోదాలో రోజుకు 18 గంటలు పని చేశానని, ఇప్పుడు ఎన్నికల వేళ పీసీసీ చీఫ్ అవతారం ఎత్తుతానని, గేట్లు ఎత్తుతానని అని రేవంత్ రెడ్డి అంటున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ‘రేవంత్.. నువ్వు గేట్లు ఎత్తి రాజకీయాలు చేస్తే, కరెంటు సంగతి ఎవరు చూడాలి?’ అని ప్రశ్నించారు. వేసవి మొదలుకాగానే కరెంటు కోతలు మొదలుపెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.