హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన బీజేపీ, హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయడం లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి గురువారం రిట్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బీజేపీ గుట్టు రట్టు కావడంతో ఈ వ్యవహారమంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగిందని బీజేపీ ఆరోపించింది. స్థానిక పోలీసుల దర్యాప్తును నిలిపివేయాలని కోరింది. పిటిషన్లో రాష్ట్ర హాం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్ హెచ్వో, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.