MLA Raja Singh | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ కొన్నాళ్లుగా గప్చుప్గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’కు సైతం దూరంగా ఉన్నారు. రాష్ట్రనాయకత్వానికి, ఆయనకు మధ్య దూరం పెరుగుతున్నదనే వాదనకు ఇది మరింత బలం చేకూర్చుతున్నది.
వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా అవకాశం లభిస్తుందని రాజాసింగ్ భావించారు. అది వేరేవారు తన్నుకుపోవడంతో అలకబూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికీ డుమ్మా కొట్టారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్షలో కూడా పాల్గొనలేదు. జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన గెలిచి రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఢిల్లీ వెళ్లిపోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.