హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిన ఉదంతంలో.. తెరవెనుక కథ నడిపించిన బీజేపీ పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు న్యాయస్థానానికి అందించిన డాక్యుమెంట్లలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పేర్ల ప్రస్తావన ప్రముఖంగా ఉంది. నిందితుడు రామచంద్రభారతి సెల్ఫోన్లను సంఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషించారు. నిందితుల మధ్య సాగిన సంభాషణలు.. బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్లతో వారు నెరిపిన సంప్రదింపులకు సంబంధించి వాట్సాప్ స్క్రీన్షాట్లనూ పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో పొందుపర్చారు. 7075779637, 8762090655 ఫోన్ నెంబర్లు ఉన్నాయని, వాటి నుంచి అందులో సేవ్ అయిన సునీల్కుమార్ బన్సల్ (9455114069)కు సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 11.52కు వాట్సాప్ మేసేజ్లు వెళ్లాయని, ఆ స్క్రీన్షాట్లను రిపోర్టులో పొందుపరిచారు.
బన్సల్కు రామచంద్ర భారతి తన ఫోన్ నుంచి సెప్టెంబర్ 26న ఓ ఎంఎంఎస్ పంపారు. తెలంగాణకు సంబంధించిన ఓ కీలక వ్యవహారంపై మాట్లాడాల్సి ఉందని, సమయం కేటాయించాలని అందులో కోరారు. ఆయనే, బీఎల్ సంతోష్కు పంపిన మరో ఎస్ఎంఎస్లో ‘25మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా 40 మందిని చేర్చుకోవాలన్నది ప్లాన్’ అని పేర్కొన్నారు. మరో ఫోన్లో.. ‘తుషార్ వెల్లపల్లి కేరళ ఎస్ఎన్డీపీ’ పేరుతో ఉన్న ఫోన్ నెంబర్తో నందకుమార్ సంభాషణలు జరిపారు. ‘తెలంగాణలో 25మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అందరూ నా సర్కిల్లోనే ఉన్నారు. వాళ్లు నేను చెప్పినట్లు వింటారు. వీలైనంత త్వరగా 40మందిని పార్టీలో చేర్చడమే ప్లాన్’ అని ఆ స్క్రీన్షాట్లలో స్పష్టంగా ఉన్నది. రోహిత్రెడ్డి, గువ్వల బాల్రాజ్, హర్షవర్ధన్రెడ్డి, రేగా కాంతారావు వెంటనే చేరేందుకు హైదరాబాద్లో సిద్ధంగా ఉన్నారని, అందులో చేరేముందు కొన్ని ‘విటమిన్లు’ అవసరమవుతాయంటూ నిందితులు కోడ్ భాషను ఉపయోగించారు. నందకుమార్కు సంబంధించిన ఫోన్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్కు సంబంధించిన 50 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జరిగిన సంభాషణలనూ పోలీసులు సేకరించారు.
పైలట్కు 100.. మిగతా వారికి 50!
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన నిందితులు సెప్టెంబర్ 26 నుంచీ వారితో సంప్రదింపులు జరిపారని పోలీసులు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి రూ.100 కోట్లు ఇవ్వజూపిన నిందితులు.. ఆయన ద్వారా వస్తున్న మిగిలిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించని పక్షంలో.. ఈడీ, సీబీఐ దాడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా వారు హెచ్చరించారు. దీంతో ఆధారాలతో సహా వారిని ట్రాప్ చేయాలని భావించిన రోహిత్రెడ్డి.. మీటింగ్ మొత్తాన్ని రికార్డు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతోనూ ఆయన పంచుకొన్నారు. ఈ కొనుగోలు కుట్రపై రాజేంద్రనగర్ పోలీసులకు రోహిత్రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఎవరీ తుషార్?
బయటకు వచ్చిన సంభాషణల ఆడియోల్లో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని రామచంద్రభారతి పేర్కొనడం రికార్డయ్యింది. కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ తాము ఇలాంటి వ్యవహారాలను నడిపినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఎన్డీయే నాయకుడు తుషార్కు ఫోన్ చేసిన రామచంద్ర భారతి.. బీజేపీ టాప్ లీడర్ బీఎల్ సంతోష్ పాత్ర కీలకమని ప్రస్తావించినట్టు పోలీసులు తెలిపారు. కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో తుషార్ వెల్లపల్లి ప్రస్తావన కూడా ఉంది. అంతకుముందు వెలువడిన ఫోన్కాల్ రికార్డింగుల్లోనూ ఆయన పేరు పదే పదే వినిపించింది. కేరళకు చెందిన తుషార్ భారత ధర్మ జనసేన (బీడీజేఎస్) నాయకుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ టాప్ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న తుషార్.. ఆ రాష్ట్ర ఎన్డీయే కన్వీనర్గా కొనసాగుతున్నారు. కేరళలోని వాయనాడ్ నుంచి గత ఎన్నికల్లో రాహుల్గాంధీ మీద ఎన్డీయే తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
4 రహస్య కెమెరాలు.. 2 వాయిస్ రికార్డర్లు
రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కుట్రను ఛేదించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ దూతలు, వాళ్లను ట్రాప్ చేయాలనుకున్న ఎమ్మెల్యేలు సమావేశమయ్యేచోట నాలుగు రహస్య కెమెరాలను, రోహిత్రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లను ఉంచారు. ఫాంహౌస్లో మధ్యా హ్నం 3.05 నిమిషాలకు రహస్య కెమెరాలను పోలీసులు ఆన్ చేశారు. అప్పటికే ఢిల్లీ బీజేపీ దూతలు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజి, నందకుమార్ ఫాంహౌస్ వద్దకు వచ్చి ఉన్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు నిందితులతో కలిసి రోహిత్రెడ్డి హాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. గంట తరువాత ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక) ఫాంహౌస్కు వచ్చారు. వీళ్ల సమావేశం దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది.
బేరసారాలపై నీళ్లు చల్లిన ‘నారియల్ పానీ’!
‘కొబ్బరి నీళ్లు’.. బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ‘నారియల్ పానీ’ అనే సిగ్నల్ అందగానే రంగప్రవేశం చేసిన పోలీసులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్న బీజేపీ దూతల్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పార్టీ ఫిరాయింపులు చేయాలంటూ ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ దూతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన తీరును మొయినాబాద్ పోలీసులు న్యాయస్థానానికి వెల్లడించారు. బేరసారాలకు సంబంధించి బుధవారం జరిగిన పరిణామాలను రిమాండ్ రిపోర్టులో కండ్లకు కట్టినట్టు పోలీసులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ ఏసీపీ నేతృత్వంలో మొయినాబాద్ పోలీసు బృందం ఈ కుట్రను ఛేదించేందుకు పకడ్బందీ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే రహస్య కెమెరాలు, వాయిస్ రికార్డర్లను ముందుగానే అమర్చింది. ఉంచారు. తాము రంగప్రవేశం చేసి, నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు ‘నారియల్ పానీ’ని కోడ్గా వాడాలని పోలీసులు ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి సూచించారు. వీళ్ల సంభాషణ పూర్తయిన తర్వాత.. ఫాంహౌస్లో పనిచేసే వ్యక్తిని పిలిచిన రోహిత్రెడ్డి.. ‘నారియల్ పానీ’ తేవాలంటూ చెప్పగానే, పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.