హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఓడిపోతున్నామన్న భయం.. మునుగోడు ప్రజల మనసుల్లో చోటు లేదన్న ఆందోళన.. బీజేపీ నాయకులను తీవ్ర అసహనానికి గురిచేసింది. ప్రచారం చివరి రోజైన మంగళవారం బీజేపీ నేతలు, అనుచరులు, కిరాయి గూండాలు మునుగోడు నియోజకవర్గంలో స్వైరవిహారం చేశారు. ఎన్నికల వేళ దాడుల సంస్కృతి ఎన్నడూ ఎరుగని తెలంగాణలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నాలుగు ఓట్లు రాబట్టుకోవాలని చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులే లక్ష్యంగా బీజేపీ దాడులకు తెగబడింది. ఈ దాడిలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, స్థానిక నేతలు బోనం శ్రీనివాస్రెడ్డి, నాతి సురేశ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దగ్గరుండి బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టారు. పరాయి మూకల కిరాయి బీజేపీ నేతలు రెచ్చిపోయి దాడులకు దిగారని స్థానికులు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పలివెల గ్రామంలో ఈటల దగ్గరుండి మరీ దాడులు చేయించటాన్ని తీవ్రంగా పరిగణించారు.
పలిమెలలో అసలేం జరిగింది?
ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక మంత్రి కేటీఆర్ సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, పట్టపాకలో రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు హాజరయ్యేందుకు పల్లా రాజేశ్వర్రెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఇప్పర్తి, పలిమెల, కోతులారం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో పలివెల చౌరస్తాలో ఈటల ఎన్నికల ప్రచారం కోసం గంటన్నర పాటు రోడ్డు బ్లాక్ చేశారు. టీఆర్ఎస్ ర్యాలీకి దారి ఇవ్వాలని పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా బీజేపీ నేతలు కానీ, ఈటల కానీ వినిపించుకోలేదు. టీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల దగ్గరికి వచ్చి రెచ్చిపోయారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వినకుండా రెచ్చిపోయిన బీజేపీ మంద టీఆర్ఎస్పై పడింది. వాగ్వాదం.. తోపులాట జరుగుతున్న సమయంలో బీజేపీ గుంపులోంచి ఒకరు టీఆర్ఎస్ జెండా కర్రను గుంజుకొని దాడికి దిగారు. అదే సమయంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్పైనా ఆరోపణలు మొదలు పెట్టారు. ఈటల పీఏ నరేశ్, ఇల్లంతకుంట (హుజూరాబాద్ నియోజకవర్గం) సర్పంచ్ కంకణాల సురేందర్రెడ్డి, హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన సాయికుమార్ రెచ్చిపోయి టీఆర్ఎస్ శ్రేణులపై రాళ్లు విసరటంతో తక్కిన బీజేపీ కార్యకర్త్తలు రెచ్చిపోయారు. అప్పటిదాకా సహనంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
దాడికి నేపథ్యం ఇదీ..
పలివెల ఈటల అత్తగారి ఊరు. ఈ గ్రామం లో సర్పంచ్ బీజేపీ నేత అయినప్పటికీ, టీఆర్ఎస్ ప్రజాకర్షక పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటే వార్డు సభ్యులు చేరిపోయారు. దీంతో బీజేపీ ఖాళీ అయింది. దీనికితోడు ఈటల సతీమణి జమున మునుపెన్నడూ లేనిది దీపావళి సందర్భంగా పలివెల లో మహిళలను మంచిగ చేసుకొనేందుకు పండుగ కట్నం అని రూ.300 చొప్పున ఇచ్చా రు. పలివెల ఆడబిడ్డలు ఆమె చర్యను ప్రతిఘటించారు. తర్వాత మూడునాలుగు రోజులకే మైదాకు పెడతామని మహిళలను పిలిచి వారి చేతుల్లో ‘కమలం’పువ్వును వేయించారు. గ్రహించిన మహిళలు తిరగబడ్డారు. ఏం చేసినా పలివెల గ్రామస్థులు తమ దారికి రావ డం లేదని ఈటల, ఆయన సతీమణి జమున ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని పథకం వేసి, మంగళవారం బయటి నుంచి వచ్చిన గూండాలతో దాడులు చేయించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మొదటి నుంచే దాడులకు దిగిన బీజేపీ
ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి మునుగోడు ప్రజలు రాజగోపాల్ను ఊరూరా నిలదీస్తున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజగోపాల్రెడ్డి తన అనుచరులను ఉసిగొల్పుతున్నారు. ‘కొట్టండ్రా.. నా కొడుకులను.. ఎవరు అడ్డువస్తారో చూస్తా’ నని తను హైదరాబాద్, బీహార్ సహా పలు ప్రాంతాల నుంచి తెచ్చుకొన్న మనుషులను ప్రజలపైకి ఉసిగొలుపుతున్నారు. వెల్మకన్నె, అంతంపేట గ్రామాల్లో మొదలైన రాజగోపాల్ దాడు లు విస్తృతమై.. మంగళవారం పలివెలలో నెత్తురు కండ్ల చూసింది.
ఉద్దేశపూర్వకంగానే దాడి: పల్లా రాజేశ్వర్రెడ్డి
మునుగోడు రూరల్: బీజేపీ గూండాలు టీఆర్ఎస్ శ్రేణులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ రోడ్షోకు కిష్టాపురం, ఇప్పర్తి గ్రామాలనుంచి బయలుదేరిన టీఆర్ఎస్ శ్రేణులు పలివెలకు చేరుకొన్నారని, అక్కడి చౌరస్తాలో ఈటల మాట్లాడుతుండగా.. అరగంటకు పైగా వేచి ఉన్నామని.. ఆ తరువాత తమకు దారి ఇవ్వాలని అడిగినందుకు ఈటల అనుచరులు కంకణాల సురేందర్రెడ్డి, గడ్డం సాయికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారని తెలిపారు. రామంతాపూర్కు చెందిన గడ్డం సాయి రాయితో తనను, పెద్ది సుదర్శన్రెడ్డిని కొట్టారని చెప్పారు. అకారణంగా దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, నల్లగొండ ఎస్పీని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఈటల రాజేందర్, ఈటల జమున, కంకణాల సురేందర్రెడ్డి (ఇల్లంతకుంట సర్పంచ్), సాయికుమార్ (హైదరాబాద్ రామంతాపూర్)లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసేలా వ్యవహరిస్తున్న రాజగోపాల్రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని, పోటీ నుంచి తప్పించాలని కోరారు.