గజ్వేల్/కొండపాక, సెప్టెంబర్ 20 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారంతా తెలంగాణకు పట్టిన శని అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని కొండపాక మండల కేంద్రంతోపాటు ఖమ్మంపల్లి, జప్తి నాచారం, దుద్దెడ గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించి లబ్ధ్దిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అనంతరం కొండపాక మండలం దుద్దెడలో కొత్త వారికి ఆసరా పింఛన్ పత్రాలు, మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. నాడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకొన్న వారే నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి, చెరువులు బాగుచేసి పుష్కలంగా నీటిని అందుబాటులోకి తేవడంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అంచనాకు మించి పెరిగిందన్నారు. కొందరు ఢిల్లీ, హైదరాబాద్లో కూర్చోని కాళేశ్వరం నీళ్లు ఎక్కడ ఉన్నాయని అంటున్నారని, వారిని తీసుకొచ్చి మల్లన్న సాగర్లో ముంచితే నీళ్లు ఉన్నాయో లేవో తెలుస్తుందన్నారు. సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో చూస్తే కాళేశ్వరం నీళ్లు కన్పిస్తాయని చెప్పారు. బతుకమ్మలు వేయాలంటే కూడా ట్రాక్టర్తో గుంతలు తీసి నీళ్లు పోసిన రోజులను ప్రతిపక్ష నాయకులు మర్చిపోయారని ఎద్దేవా చేశా రు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కరువు ఉండేదని, ఇప్పుడు కాళేశ్వరంతో నీరు పుష్కలంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో పండిన పంట నిల్వ చేయడానికి గోదాములు సరిపోవడం లేదని తెలిపారు. ఉపాధి కోసం వలస పోయిన తెలంగాణలో.. ఇప్పుడు బెంగాల్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి కూలీలు వలస వస్తున్నట్టు చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నదని, తెలంగాణకు మేలు చేయని వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ అధికారం ఉన్న రాష్ర్టాల్లో రూ.2 వేల పింఛన్లు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉచితాలు వద్దంటున్నదని, ఉచిత కరెంట్ ఇవ్వడం వద్దంటున్నదని, వాటిని బంద్ చేసే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పడంతో నిధులు ఇవ్వకుండా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించారు.
కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నదన్నారు. ఇంకా అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని, కేసీఆర్ దేశరాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ప్రకటించగానే తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ర్టాల్లోని రైతు నాయకులంతా సంతోషాన్ని వెలిబుచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధా కృష్ణశర్మ, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.