హైదరాబాద్: బీజేపీ నేతలు అసమర్థులు(Inability) అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ.. తాను చేసిన ఛాలెంజ్ వాళ్లు స్వీకరించలేకపోతున్నట్లు తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, దేశంలో తెలంగాణ రాష్ట్రం కన్నా మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఒక్క రాష్ట్రం పేరు చెప్పాలని కోరుతూ ప్రధాని మోదీకి సవాల్ చేశారు. ప్రధాని మోదీ(PM Modi) కానీ లేక ఏదైనా బాధ్యతాయుతమైన బీజేపీ కేంద్ర మంత్రి కానీ ఈ సవాల్పై స్పందించాలని మంత్రి కేటీఆర్(Minister KTR) తన ట్వీట్లో తెలిపారు. కానీ బీజేపీ నేతల్లో స్పందన లేకపోవడం వారి అసమర్థతను బయటపెడుతుందని అన్నారు.
I had challenged @narendramodi Ji or any responsible BJP Union Minister to name a state in India that has performed better all round than Telangana in last 9 years👇
Their reluctance/inability to respond speaks volumes https://t.co/ztynO31sGh
— KTR (@KTRBRS) April 12, 2023
నిజానికీ ఇదే అంశంపై ప్రధాని మోదీకి 9వ తేదీన మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ కానీ, సమానంగా కానీ వృద్ధి సాధించిన రాష్ట్రాన్ని దేశంలో చూపించగలరా? అం టూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు సవాల్ విసిరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. దేశంలో అనేక అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ గురించి ఒక్క అభినందన కూడా తెలపలేదని ఆక్షేపించారు. రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారని విమర్శించారు. అయితే ఇంత వరకు బీజేపీ నేతలు స్పందించకపోవడం పట్ల కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు సవాల్ను స్వీకరించేందుకు అయిష్టంగా ఉన్నారని, వాళ్లు అసమర్థులు అని అన్నారు.