కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్పై భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నాయకుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటల త్వరలోనే బీజేపీలో చేరుతారని వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో కరీంనగర్కు చెందిన బీజేపీ నాయకుడు అరుకాల వీరేశలింగం స్పందించారు.
ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చేది ప్రజలపై ప్రేమతో కాదు.. ఆస్తుల మీద ప్రేమతో అని ఆయన అన్నారు. వేలాది కోట్ల అక్రమాస్తులు, వేల ఎకరాల భూమిని కాపాడుకోవడం కోసమే ఈటల బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. అక్రమాస్తులు సంపాదించినందుకు ఎక్కడ జైల్లో పెడుతారని భయపడి, అన్ని పార్టీల నాయకుల వద్దకు వెళ్లి అభిప్రాయ సేకరణ చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీలోకి వెళ్తేనే బతికిపోతావు అని అందరూ ఆయనకు సలహా ఇస్తున్నారు. ఈటల ఏ పార్టీలో చేరినా.. ఆయనను ఓడించడమే తన ధ్యేయమని వీరేశలింగం స్పష్టం చేశారు.
గులాబీ కండువా లేకపోతే తాను లేనని ఎన్నో వేదికల మీద ఈటల చెప్పారు. గులాబీ కండువా నీడనే ఎదిగాను అని చెప్పుకున్నాడు. గులాబీ జెండా లేకుంటే సంక్షేమం లేదని చెప్పిన ఈటల.. అంతలోనే మాట ఎలా మారుస్తాడు అని వీరేశలింగం ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కరీంనగర్ దాటితే బీసీ నేత కాదు.. బడా నేత అని ధ్వజమెత్తారు. ఆత్మగౌరవం ఆయన ఒక్కడికే కాదు.. ఆయన బారినపడ్డ తమకందరికి ఉందన్నారు. ఈటల అణిచివేత భరించలేక ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఈటల రాజేందర్ తనలాంటి వారికి ఎందరికో అన్యాయం చేశారు.
ఈటలను కడుపులో పెట్టుకుని కాపాడి, తీరా గెలిచాక బలై పోయామని వీరేశలింగం తెలిపారు. బీసీల పట్ల ఈటల రాజేందర్కు ఏ మాత్రం గౌరవం లేదు. ఆయన పొలిటిక్ గేమ్ గ్రామాల్లో అందరికీ తెలుసు అని అన్నారు. ఈటల రాజేందర్ బాధితులందర్నీ బయటకు తెస్తానని స్పష్టం చేశారు. ఈటలకు బుద్ది చెప్పే రోజు తప్పకుండా వస్తుందని అరుకాల వీరేశలింగం పేర్కొన్నారు.