హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీజేపీకి చెందిన పలువురు నేతలు వరుసగా సమావేశం అవుతున్నట్టు ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి ఒప్పుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గెలిచే బలం లేదని పేర్కొన్నారు. పలువురు బీజేపీ అసంతృప్త నేతలు ఇటీవల వరుసగా రహస్య భేటీలు నిర్వహిస్తూ, ఐదుగురు మాజీ ఎంపీలతో సహా దాదాపు 10 మంది నేతలు ఒకేసారి పార్టీని వీడేలా నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. కొంతకాలంగా అధిష్ఠానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న మాజీ ఎంపీ విజయశాంతి నివాసంలో తాజా భేటీ జరిగింది. దీంతో వీరంతా మూకుమ్మడిగా పార్టీని వీడుతారన్న వాదనకు బలం చేకూరింది. దీనిపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బుధవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, తమ భేటీలు నిజమేనని, అయితే అవి రహస్య సమావేశాలు కాదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గెలిచే బలం లేదని, లోటుపాట్లపై చర్చించేందుకే సమావేశం అవుతున్నామని పేర్కొన్నారు. అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు విశ్వేశ్వర్రెడ్డితో ఈ విధంగా మాట్లాడించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజంగా రహస్య సమావేశాలు కాకపోతే పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే భేటీ కావచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి తెలిసే సమావేశమయ్యామని, చర్చించిన విషయాలను ఆయనకు ఎప్పటికప్పుడు వివరించామని విశ్వేశ్వర్రెడ్డి ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు. దీనిని బట్టి రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే అసంతృప్త నేతలు సమావేశమైనట్టు స్పష్టమవుతున్నది. తాము చర్చించిన అంశాలను ప్రకాశ్జవదేకర్కు వివరించామని కొండా చెప్పడం గమనార్హం. రాష్ట్ర అధ్యక్షుడికో, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీకో చెప్పకుండా ఎలాంటి అధికారాలు లేని రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షక్షుడికి చెప్పడం హాస్యాస్పదమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యలను బట్టి అసంతృప్త నేతలంతా ఒక్కటయ్యారని, రహస్యంగా భేటీ అయ్యారని భావిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు ఒకటిరెండు రోజుల ముందే వారంతా బీజేపీని వీడే అవకాశం ఉన్నదని విశ్లేషకుల అంచనా.