రాజన్న సిరిసిల్ల, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఆత్మరక్షణ కోసం సర్కారు ఇచ్చిన ఆయుధాలను బీజేపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు ఎల్లారెడ్డిపేట ఠాణాకు వెళ్లిన టీఆర్ఎస్ నాయకులపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి దౌర్జన్యానికి దిగాడు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను తుపాకీతో బెదిరించాడు. అతడి శ్రుతిమించిన ఆగడాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. విచారణ చేపట్టి అతని లైసెన్స్ను రద్దు చేశారు. గతంలో కూడా ఎల్లారెడ్డిపేట ఠాణా ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న గోపి అందరిని భయభ్రాంతులకు గురిచేశాడు. బీజేపీ నేతలు కేంద్రంలోని అధికారాన్ని అడ్డంపెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, యూపీ, బీహార్లో కనిపించే గన్ కల్చర్ను తెలంగాణకు తెస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.