BJP | పెద్దపల్లి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ కొడుకు, విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాషాయపార్టీలో దుమారం రేపుతున్నాయి. బుధవారం వంశీ తన ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియో పోస్టు చేశారు. ‘ప్రధాని మోదీ పార్లమెంట్లో రాహుల్గాంధీ ఫ్లయింగ్ కిస్కు ఇచ్చిన ప్రాధాన్యం మణిపూర్ ఘటనకు ఇవ్వలేదని, ఈ అల్లర్లలో ఎందరో మహిళలు బలైపోయారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడం బాధాకరమని, ప్రతిపక్షాలు పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టి, చివరి నిమిషంలో ఓటింగ్ జరగకుండానే వాకౌట్ చేయడం సరైన చర్య కాదని, బీజేపీ నేతలు ఈ చర్చలో పాల్గొననే లేదని తెలిపారు.
మణిపూర్ సంక్షోభాన్ని తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఈ తీరుతో దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశముంటుందని, ఇప్పటికైనా కనువిప్పు కలగాలి.. అని హెచ్చరించారు. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో దానిని తొలగించగా, అప్పటికే అది వైరల్గా మారింది. ఫేస్బుక్తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో దుమారంగా మారింది. బుధవారమే తాను ఏ పార్టీలో చేరడం లేదని, బీజేపీలోనే ఉంటానని మాజీ ఎంపీ వివేక్ చెప్పిన 24 గంటల్లోనే ఆయన తనయుడు వంశీ ఇలా ప్రధానీ మోదీ, బీజేపీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలోనే ఆయన తనయుడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.