Bandi Sanjay | వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో దీక్ష చేస్తానని ప్రకటించడంపై సీరియస్ అయ్యారు.
కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేసినందుకు దీక్ష చేస్తారా? పౌరసత్వ చట్ట సవరణ చేసినందుకు దీక్ష చేస్తారా? దేనికి దీక్ష చేస్తారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ను బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక పేరు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పేర్లు చెప్పి దేశంలోని ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.