Bandi Sanjay | ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని బీజేపీ నేత బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రకటించి రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ నియామకాల భర్తీ అని రేవంత్ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటివరకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఊసే లేదని విమర్శించారు. మేనిఫెస్టో ఎన్నికల వరకే పవిత్ర గ్రంథమా? ఎన్నికలయ్యాక చిత్తు కాగితమా? అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. ఎప్పుడేమవుతుందో అర్థం కాని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆరోపించారు.