అది రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్. కేంద్ర సహాయ మంత్రి దేవ్సిన్హ్ చౌహాన్.. తుర్క యాంజాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. గుడి ఆవరణలో ఆయన ఆసనంపై కూర్చొన్నారు. ఆయనతోపాటు అక్కడికి వచ్చిన స్థానిక దళిత కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్కుమార్ ఎవరూ పట్టించుకోక పోవడంతో బిక్కమొఖం వేసుకొని కింద కూర్చొన్నారు. ఆ తరువాత జరిగిన స్థానిక బీజేపీ సమావేశానికి కూడా ఆమెను లోపలికి రానీయలేదు.
గుడిలో కేంద్ర సహాయ మంత్రికి కుర్చీ.. కింద కూర్చోవాల్సి వచ్చిన దళిత నేత సమావేశం హాల్లోకీ అనుమతి లేదు.. కేంద్రమంత్రి తీరుపై దళిత సంఘాల ఆగ్రహం తుర్కయాంజాల్, ఆగస్టు 30: బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తున్నదో తెలంగాణలోనే మరోసారి వెల్లడైంది. తెలంగాణలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సొంత పార్టీకి చెందిన ఓ దళిత కౌన్సిలర్కు కనీస మర్యాద ఇవ్వకుండా.. బీజేపీ నేతలు దారుణంగా అవమానించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి దేవ్సిన్హా చౌహా న్ కార్యకర్తలతో కలిసి మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఏవీనగర్లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని దర్శించుకొన్నారు.
దర్శనం అనంతరం కేంద్ర సహాయ మంత్రి గుడి ఆవరణలో కూర్చున్న సందర్భంలో ఆయనతోపాటు తుర్కయాంజాల్ కౌన్సిలర్ కరాడి శ్రీలత ఉన్నారు. మంత్రికి మాత్రమే కుర్చీ వేయడంతో కౌన్సిలర్ శ్రీలత కింద కూర్చోవాల్సి వచ్చింది. కనీసం ఆమెను పట్టించుకొని కుర్చీ వేస్తామన్న వాళ్లు లేకపోయారు. కౌన్సిలర్ శ్రీలత దళిత మహిళ కావడంతోనే ఆమెను కింద కూర్చోబెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక దళిత, మహిళ కౌన్సిలర్ను కింద కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అంతేగాక బొంగులూరు గేట్ వద్ద ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి ఎలాంటి బాధ్యతలు లేని అగ్రవర్ణాల నాయకులను ఆహ్వానించిన బీజేపీ నాయకులు కౌన్సిలర్ శ్రీలత మీటింగ్ హాలులోకి వెళుతుంటే అడ్డుకొని, అవమానించారు. దళితుల ఇండ్లల్లోకి వెళ్లి భోజనం చేశామని ప్రచారం చేసుకొనే బీజేపీ నేతలు మొదట వారిని సమాజంలో గౌరవించడం నేర్చుకోవాలని హితవు చెప్తున్నారు.
అది.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం. ఆసరా పింఛన్లకు సంబంధించి కార్డులు పంచుతున్న సందర్భం. ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వచ్చారు. ఒక్కొక్కరికీ కొత్త పింఛన్ కార్డులు అందిస్తున్నారు. వేదిక మీదకు బోదేపల్లికి చెందిన దళిత వృద్ధురాలు అల్లంకొండ పోసాని కార్డు అందుకోవడానికి వచ్చారు. వేముల కార్డు అందజేయగానే ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఆమె.. మంత్రిని కొడుకుగా భావించి గట్టిగా ఆలింగనం చేసుకొన్నారు. వేముల ఆమెను తల్లిగా దగ్గరకు తీసుకొని ఓదార్చారు.