BJP | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. రోజుకో గ్రూపు తయారవుతూ.. నేతలు ఒకరిపై ఒకరు బురద చల్లుకొంటున్నారు. తాజాగా బండి సంజయ్ని తప్పించి కిషన్రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా, ఈటల రాజేందర్ను ప్రచార కమిటీ చైర్మన్గా ప్రకటించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీలో ముసలం మరింత ముదురుతున్నది. ఓవైపు ఇన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ధర్మపురి అర్వింద్ వంటి నేతలు ఒక్కసారిగా తెరమీదికి వచ్చారు. ఇన్నాళ్లూ రాజ్యమేలిన బండి సంజయ్ వర్గ నేతలు తప్పని పరిస్థితుల్లో తెరచాటు కు వెళ్లిపోయారు. కిషన్రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతలు ఇప్పటికే పార్టీలో తాము ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించుకొన్నట్టు చర్చ జరుగుతున్నది.
అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈటల వర్గం.. ఇకపై విజృంభించాలని కంకణం కట్టుకొన్నది. మరోవైపు.. ‘బెదిరించినవాళ్లకే పదవులు ఇస్తారా? మాకు కూడా పదవి కావాలి’ అంటూ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. పట్టుమని పది మంది నేతలు లేని చోట పదవుల కొట్లాట మాత్రం గట్టిగా నడుస్తున్నది. ఢిల్లీ పెద్దలపై అలకలు, అల్టిమేటాలు, లీకులు.. ఇలా పదవి కోసం సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ప్రజల గురించి వదిలిపెట్టి రాజకీయమంతా పదవుల చుట్టే తిరుగుతున్నది. తమకు ఏయే పదవులు కావాలో కూడా వాళ్లే నిర్ణయించుకొని, ఢిల్లీకి వెళ్లి మరీ చిట్టా చదివి వస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర పార్టీలోని పాతతరం నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలోనే తేల్చుకుంటాం..
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో కొత్త నేతలు, పాత నేతల మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తున్నది. కష్టపడ్డవారికే గుర్తింపు దక్కుతుందని, ఎవరికి ఎప్పుడు ఏ పదవి వస్తుందో ఎవరికీ తెలియదని చెప్పుకొన్నదంతా బోగస్ అని తేలిపోయిందని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఇన్నాళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్నా పదవులు దక్కలేదనుకొనే వారంతా ఒక వర్గంగా తయారైనట్టు తెలిసింది. పదవుల కోసం తాము కూడా ఢిల్లీలోనే తేల్చుకోవాలని తీర్మానించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కొత్త తరహా పద్ధతికి శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లూ ఈటలతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన.. ఈటలకు పదవి అప్పగించిన రోజే కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో చర్చలు జరిపారు.
తనకు పదవి రాలేదన్న అసంతృప్తో లేదా వచ్చే ఎన్నికలకు సంబంధించిన మరేదైనా డిమాండ్ను నెరవేర్చుకోవడానికో ఇలా చేశారంటూ సీనియర్లు పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన నేతల వల్ల పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిందని పాత తరం నేతలు మండిపడుతున్నారట. పార్టీలో చేరగానే పదవులు ఆశించేవాళ్లు, షర్ట్ మార్చినంత సులభంగా కండువాలు మార్చేస్తారని చెప్తున్నారట. ‘మా పార్టీలోకి వస్తే ఫలానా పదవి ఇస్తాం’ అని ఆఫర్ వస్తే చాలు ఎగరిగంతేసుకుంటూ వెళ్తారని చెప్తున్నారని తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల నాటికి మళ్లీ పాత నేతలే మిగులుతారని సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం.
కొత్త వర్గం తెరమీదికి..
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన వర్గం నేతలదే రాజ్యంగా నడిచింది. పార్టీ ప్రధాన కార్యాలయం మొదలు బూత్ స్థాయి వరకు బండి మనుషుల కనుసన్నల్లోనే సాగింది. దీంతో ధర్మపురి అర్వింద్ వంటి నేతలు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అర్వింద్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒకటిరెండుసార్లు మాత్రమే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కానీ కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగించిన వెంటనే అర్వింద్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా ఉత్సాహంగా కనిపించారు. దీనిని బట్టి రాష్ట్ర బీజేపీలో కొత్త వర్గం తెరమీదికి రావడం మొదలైందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈటల రాజేందర్తోపాటు వచ్చిన ఒకరిద్దరు నేతలు తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని ఇన్నాళ్లూ వాపోయారు. ఇకపై వారికి కూడా మంచి పదవులు వస్తాయని, కొత్తగా వర్గాన్ని తయారు చేసుకొంటారని నిపుణులు పేర్కొంటున్నారు.