కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో 65 శాతం ఉన్న బీసీ వర్గాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. యావత్ బీసీలకు సంబంధించి మూడు డిమాండ్లను చాలాకాలం ముందే కేంద్రం ఎదుట పెట్టినా వాటిపై కనీసం మాట కూడా మాట్లాడకపోవడం దీనికి నిలువెత్తు నిదర్శమన్నారు.
ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్తో కలిసి కరీంనగర్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటుగా తెలంగాణలో జరిగాయి. ఈ సమావేశాలకు వచ్చిన ప్రధాని మోదీ ఒక బీసీ బిడ్డగా బీసీలకు సంబంధించి ఒక పాజిటివ్ డిక్లరేషన్ చేస్తారని బీసీ వర్గాలు భావించాయి.
నిజానికి రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే కేంద్రంలోనూ ప్రత్యేకంగా బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మోదీ సర్కారును కోరామన్నారు. అలాగే బీసీ కుల గణన చేయాలని చాలా కాలంగా కోరుతున్నాం. ఈ విషయంలోసీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ శానసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
బీసీ జనాభా తేల్చాలని మోదీ సర్కారు ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఇది ఒక తెలంగాణవాసుల డిమాండ్ కాదు, దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్. కానీ, ఈ విషయంలో బీజేపీ నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శించారు.
జనాభాలో 65 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలతో ఈబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని మేము స్వాగతిస్తున్నాం. అయితే అత్యధిక జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బియ్యం సేకరించడంలో కూడా కేంద్రం మొండి ప్రదర్శిస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నిత్యం గొప్పలు చెప్పడం కాదు, రాష్ట్రంలో మీ ప్రధాని వచ్చే నాటికి 2,950 మిల్లులు మూత పడ్డాయి. వాటిపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఇదంతా మీ కేంద్రం మొండి వైఖరి పుణ్యమే కదా..! మరి ఈ విషయాన్ని మీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారో ప్రజలకు చెప్పాలన్నారు.
అంతేకాదు వర్షకాలం పంట కొంటరా..? కొనరా..? ఏదో ఒకటి తేల్చిచెప్పాలని డిమాండ్చేసారు. మాటి మాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మాట్లాడుతున్నారు. దమ్ముంటే నేను సవాల్ విసురుతున్నా. ఒక ఎమ్మెల్యేను ముట్టుకొని చూడండి.
పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుందన్నారు.టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టింది. తెలంగాణ ప్రజల ఆయుధం ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ గడ్డపై కేసీఆర్ ఉన్నంత వరకు బీజేపీ ఏమీచేయలేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు.