హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ దూతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫోన్ సంభాషణలు, కాల్ డాటాలు పక్కాగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించిన ముగ్గురి సెల్ఫోన్ల నుంచి జరిగిన కాల్డాటా రికార్డుతోపాటు ఆయా సమయాల్లో వారు మాట్లాడుకొన్న సమాచారాన్ని సైతం టెలికం కంపెనీల నుంచి తీసుకొన్నట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై దృష్టిసారించిన అనేక సంస్థలు కొద్దిరోజులుగా చేస్తున్న పరిశోధనల్లో సంచలనాత్మక అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ పరిశోధనలు చేసిన వర్గాల సమాచారం ప్రకారం బీజేపీలోని ఉన్నతస్థాయి నాయకులైన బీఎల్ సంతోష్, తుషార్తో ఈ ముగ్గురు ఫోన్లలో మాట్లాడిన వివరాలను చట్టబద్ధంగా సేకరించినట్టు సమాచారం. నిందితులు వాడిన సెల్ఫోన్లు వివిధ టెలికం నెట్ వర్క్ కంపెనీల పరిధిలో ఉండటంతో ఆయా కంపెనీల నుంచి డాటాను తీసుకొన్నందున న్యాయపరంగానూ ఇవి కీలక ఆధారాలుగా మారనున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
తప్పించుకోలేరు
బీజేపీ దూతల్లో కీలకమైన రామచంద్రభారతికి సంబంధించి ఏకంగా 2015 నుంచి కాల్ డాటా అందుబాటులోకి రావడంతో వివిధ రాష్ర్టాల్లో మీడియా సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. బీజేపీ దూతలు.. ఢిల్లీ పెద్దలు మొదలు వివిధ రాష్ర్టాల్లో ఉన్న కీలకమైన బీజేపీ నేతలతో, పలు రాష్ర్టాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన అనేక మందితో ఎప్పుడు మాట్లాడారు? ఏయే సమాచారాన్ని పంచుకొన్నారు? అన్న సమాచారం మొత్తం అందులో ఉన్నట్టు తెలిసింది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం వ్యవహారంలో ఫోన్ సంభాషణలు సైతం సాంకేతిక అస్ర్తాలుగా మారాయి.
ఫాంహౌస్ నుంచి రామచంద్రభారతి అహ్మదాబాద్లో ఉన్న బీఎల్ సంతోష్, ఆపై ఢిల్లీ వెళ్లిన సమయంలోనూ జరిగిన ఫోన్ సంభాషణలు ఉన్నాయి. అదేవిధంగా రామచంద్రభారతి కేరళలో ఉన్న జగ్గుస్వామితో మాట్లాడటంతో పాటు ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్షా వ్యక్తిగత కార్యదర్శి సాకేత్ కుమార్తో చేసిన సంభాషణలు.. సాగించిన చాటింగ్లు అన్నీ ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సాంకేతిక ఆధారాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ ఇలా పలు రాష్ర్టాల్లోని 40-50 సర్వర్ల నుంచి సాంకేతిక డాటా సేకరించారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దరిమిలా దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు, సీఎంలకు చేరిన భారీ వివరాల్లో బీజేపీ దూతలు ఆ పార్టీ పెద్దలు, ఇతరులతో మాట్లాడిన కాల్ డాటా, ఇతరత్రా సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ వివరాలను సర్వర్ల నుంచి తొలగించడం కూడా సాధ్యం కాదని, ఎలాగూ ఆయా టెలికం కంపెనీలు ధృవీకరించిన వివరాలే ఉన్నందున ఈ కేసుల నుంచి నిందితులు వారి వెనుక ఉన్న పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునేందుకు అవకాశమేలేదని విశ్లేషించారు.
సర్వర్లలో నిక్షిప్తం
సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణలు వివిధ టెలికం నెట్వర్క్ల పరిధిలో ఉంటాయి. కాల్ చేసే వారిది ఒక నెట్వర్క్ ఉంటే. కాల్ రిసీవ్ చేసుకొనే వారిది అదే నెట్వర్క్ లేదా మరొక నెట్వర్క్లో ఉంటుంది. నెట్వర్క్ ఏదైనా అవి విస్తరించిన ప్రాంతాల్లో కాల్డాటా రికార్డు కోసం ప్రత్యేకంగా సర్వర్లను నిర్వహిస్తారు. ఇందులో ఎవరికి ఎవరు ఫోన్ చేశారు? ఎంత సమయం మాట్లాడారు? వంటి సమాచారం టెలికంనెట్ వర్క్ల వద్ద రికార్డు అవుతుంది. కాల్డాటా ముఖ్యమని భావించిన సందర్భంలో సంబంధిత ఫోన్ నంబర్లకు సంబంధించిన కాల్డాటాతో పాటు ఏం మాట్లాడుకొన్నారన్న సంభాషణలను టెలికం కంపెనీలు రికార్డు చేసి, దాన్ని న్యాయపరంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కేసుల విచారణలో ఇలాంటి సమాచారం కీలకమైనప్పుడు ప్రభుత్వ సంస్థలు టెలికం కంపెనీల నుంచి కాల్ డాటాను సేకరిస్తుంటాయి. ఆయా నెట్వర్క్లు తమ సర్వర్లలో కాల్ డాటా, ఎస్ఎంఎస్లు, వ్యాట్సాప్ చాటింగ్లు అన్నింటినీ స్టోర్ చేస్తారు.