లుక్ఔట్ నోటీసు జారీ..
హైదరాబాద్, నవంబరు 21 (నమస్తే తెలంగాణ): జగ్గుస్వామిపై సైబరాబాద్ పోలీసులు ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఆయనను విచారణకు పిలిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన కనిపించడంలేదన్న సమాచారంతో లుక్ఔట్ నోటీసులు జారీ చేసినట్టు తెల్సింది. దేశంలోని ఏ పోలీసు స్టేషన్ పరిధిలోనైనా జగ్గుస్వామి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, ఆయన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్నాడని, తాము ఆయన కోసం వెతుకుతున్నట్టు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి చెందిన ఏసీపీ లుక్ఔట్ నోటీసులో పేర్కొన్నారు. తమకు ఆయన గురించి తక్షణం సమాచారం అందించాలని దేశంలోని అన్ని పోలీసు యూనిట్లకు సమాచారం ఇచ్చారు.
డాక్టర్ కాదు.. ఉత్త బ్రోకరే
ఎమ్మెల్యేల ఎర కేసులో ‘విటమిన్ -ఎం’ (డబ్బులు) సప్లయర్ జగ్గుస్వామి.. అసలు డాక్టరే కాదు. ఆయన ఉత్త బ్రోకర్ అని తెలిసింది. ఆయన తానో సన్యాసిని అని చెప్పుకుంటాడని, కానీ, ఆయనకు పెండ్లయిందని స్థానికులు చెప్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల ఎర కేసులో రామచంద్రభారతి ఎమ్మెల్యేల కొనుగోలు తతంగంలో జగ్గుస్వామి ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జగ్గుస్వామి గురించి రామచంద్రభారతి ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావుకు వివరించారు. ఆయన ‘ఎయిమ్స్’లో పనిచేస్తారని, ఎయిమ్స్ వైద్యుడని చెప్పారు. దీనిపై పలు మీడియా సంస్థలు కేరళలో ఆరా తీశాయి.
మీడియా పరిశోధనలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మొత్తం ప్రస్థానం బ్రోకరిజంతోనే సాగిందని, అసలు ఆయన వైద్యుడేకాదని ఈ సంస్థలు తేల్చిచెప్పాయి. ఆయన తొలుత మాతా అమృతానందమయికి అనుచరుడిగా చేరాడని, మెల్లమెల్లగా ఆ సంస్థలో వలంటీరుగా పనిచేస్తూ.. ఉద్యోగం సాధించారని, ఉద్యోగం సాధించిన తర్వాత కూడా తన స్థాయికి మించి పరిచయాలు ఉన్నట్టు చెప్పుకొనేవాడని, ఈ క్రమంలోనే ఆయనకు భారత ధర్మ జనసేన (బీడీజేఎస్) నేత తుషార్ వెల్లపల్లితో పరిచయం ఏర్పడటం, ఆయన ద్వారా రామచంద్రభారతిని కలవడంతో దశ తిరిగింది. పెద్ద పెద్ద బ్రోకర్ పనులు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అమృతానందమయి సంస్థ 600 కోట్ల రూపాయల వ్యయంతో ఫరీదాబాద్లో కట్టిన దవాఖానకు స్వయంగా ప్రధానమంత్రిని రప్పించాడు. తద్వారా తనకు ఎంత పలుకుబడి ఉన్నదో చూపించాడు.
బీజేపీకి సంబంధించి పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈయన పాత్ర కూడా కీలకమని చెప్తున్నారు. పార్టీ తరఫున డబ్బుల వ్యవహారాలను ఈయనే మాట్లాడుతారని.. తుషార్తో కలిసి వ్యవహారాలను చక్కబెడ్తారని చెప్తున్నారు. కేరళలోని ఎర్నాకులంలో ఉండే జగ్గుస్వామి అమృత మెడికల్ ఇన్స్టిట్యూట్లోనే ఉంటాడని, అక్కడ ఆయన ఇప్పుడు కీలక వ్యక్తి అని చెప్తున్నారు. తనకు తాను ఆయన డాక్టర్ అని చెప్పుకుంటారని, కానీ, ఎక్కడ వైద్య విద్య అభ్యసించలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల ఎర కేసు బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన కనపించడంలేదు. ఆయనను బీజేపీ అధిష్టానం కర్ణాటకలోని షిమోగాలో దాచినట్టు ప్రచారం జరుగుతున్నది.