కమలాపూర్: దళితులను ఆదుకునేందుకు మేం దళిత బంధు తెస్తుంటే, ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది మండల ఇన్చార్జి పేరియాల రవీందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
బీజేపీ హయాంలో సామాన్యుడు బతికే వీలుందా.. అని ప్రశ్నించారు. నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి, పేదల, రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ గెలిచిన ఆ పార్టీ ఎంపీ రూపాయి పనన్నా చేసిండా అని ప్రశ్నించారు. దళిత బంధు పథకంపై కుట్రలు చేస్తూ, అడ్డుకునే ప్రయత్నాలు ఆ పార్టీ నాయకులు చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అమలు కావడం, దేశ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.
అర్హులందరికీ కచ్చితంగా దళితబంధుతో లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. సోమవారం శాలపల్లిలో ముఖ్యమంత్రి సభకు మండలం నుంచి 15 వేల మందికిపైగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వాల తీరు నచ్చకనే ఆపార్టీని వీడుతున్నారని చెప్పారు. స్వరాష్ట్రంలో రైతులతో పాటు పేదల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.
కచ్చితంగా అన్ని వర్గాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ మెట్టుపల్లి సుభాష్, వార్డు మెంబర్లు నాగుర్ల వెంకటేశ్, పాత భార్గవ్, దాసరి శ్రీనివాస్, సురావు రాజేశ్, ఎండీ హకీమ్, మర్రిపెల్లి రాజేశ్, సురావు సాంబయ్య, రాజులు, సముద్రాల సాయిలు, శ్రీనివాస్, ఒగ్గోజు మొగిలి, సముద్రాల శ్రీనివాస్, సముద్రాల చంద్రమౌళి, 100 మందికి పైగా చేరారు.