సిద్దిపేట : రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దే దిగాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మోదీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని కేంద్రం తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. గజ్వేల్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన బీజేపీ నేతలను నిలదీయాలి. వడ్లు కొంటరా..కొనరా అని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ చేసిందేంటి ? రైతుల కోసం సీఎం చేయాల్సింది చేశారన్నారు.
పంట కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రం..
పంట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని బీజేపీపై మండిపడ్డారు. పంటలు పండిన చోట ధాన్యాన్ని కొని, పండని చోట, ప్రకృతి విలయాలు ఏర్పడిన చోట ప్రజలకు అవసరమైన ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ విధి. పంటలు పండించడం రాష్ట్రం బాధ్యత, దాన్ని కొనే బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు తొలిగిపోయాయన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పటికే 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా నగదుగా ఇచ్చాం. పెట్టుబడి సాయంగా ఇచ్చాం. అప్పుగా కాదన్నారు. రైతుల కోసం ఎంతో చేస్తుంటే రైతు ఆగం కావాలే అని బీజేపీ కోరుకుంటోంది. ఆ కోపం టీఆర్ఎస్ మీదవస్తే రాజకీయంగా లబ్ధి పొందుదామని కుట్ర పన్నుతున్నరని వారి కురుచ బుద్ధిని ఎండగట్టారు.
కేంద్రం కొనదు కాక కొనదు..
సీడ్ కంపెనీలు ఇస్తే వడ్లు వేసుకోండి, తినడానికి వేసుకోండి, మిల్లర్లుకు అవసరమైతే వడ్లు వేసుకోమని సీఎం చెప్పిండ్రు. ఎందుకంటే కేంద్రం కొనదు కనుక. అందుకే సీఎం కేసీఆర్ రైతు నష్టపోవద్దని ప్రత్నామ్నాయ పంటలు వేయండని కోరారు. కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ఏదో మాట్లాడతరు.
కిషన్ రెడ్డి రైతు మీద ప్రేమ ఉంటే మీ ప్రధానిని ఒప్పించి యాసంగిలో వడ్లు కొంటవా కొనవా..అది చెప్పు ముందు అని నిలదీశారు. కొనిపించి మాట్లాడుతప్ప నీ సొల్లు పురాణం ఎవరూ వినరన్నారు. తెలంగాణలో పండేదే బాయిల్డ్ రైస్. ఎండ కాలం వేడిఎక్కువ కనుక రా రైస్ ఇక్కడ నడవదు. నూకలయితది. ఇంత కాలం అమ్మింది అదే..కేంద్రం కొన్నది అదే. ఎందుకు కొనవో చెప్పు అని సూటిగా ప్రశ్నించారు.
బీజేపీ నేతలు గ్రామాలకువస్తే గళ్లా పట్టుకుని అడగాలే..
బీజేపీ ఏం ఇచ్చింది తెలంగాణకు. బీజేపీ నేతలను అడగాలే. ఏడు మండలాలు తీసి ఏపీలో కలిపిండ్రు. లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ను ఆంధ్రాకు ఇచ్చిండ్రు. బయ్యారం ప్రాజెక్టు లేదు. సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రయివేటు వారికి అప్పజెప్తున్నరు. గిరిజన యూనివర్సిటీ ఇస్తమని ఎగబెట్టింది బీజేపీ పార్టీ. రైతు వ్యతిరేక బీజేపీకి గుణ పాఠం చెప్పాలన్నారు.
కార్పొరేట్ కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వం..
బీజేపీ రైతుల ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు లాభం చేస్తోంది. బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుంది. రైస్ ను ఎక్స్ పోర్టు చేయి. కొంత రైతుల కోసం భరించు. మేం భరిస్తలేమా.. అని ప్రశ్నించారు. లక్షల కోట్లు కార్పొరేట్ వర్గాలకు ఇవ్వడానికి చేతులు వస్తాయి కాని, రైతులకు ఇవ్వడానికి చేతులు రావడంలేదని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది.
రైతులను దూరం చేయాలని కుట్ర చేస్తోంది. ఈ కుట్రను తిప్పికొట్టాలి. ఈ బాధ్యత మనదే అన్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ సీఎం ఉన్నరు. అక్కడ ఎల్లిగడ్డను అక్కడి రైతులు రోడ్డు మీద పోసి అంటుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనికి సమాధానం చెప్తరా..బట్టె బాజ్, జూటే బాజ్ మాటలు మాట్లాడతరు బీజేపీ వాళ్లు. అక్కడ ఎందుకు కొనలేదు. ఇక్కడ బీజేపీ నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముందా..
మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే, రైతుల మీద ప్రేమ ఉంటేనీ ఢిల్లీని ఒప్పించు. రాజకీయాలు చేస్తామంటే నడవదు. ఎక్కడకు వచ్చినా బీజేపీ నేతలను నిలదీయాలి. ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉండగ మోటర్లు కాలో, నీళ్లు లేక, బోరు ఎండిపోతే.. రైతు చనిపోతే కాంగ్రెసోళ్లు ఎక్స్ గ్రేషియా ఇచ్చినరా ఆనాడు ఇవాళపెద్దగా మొత్తు కుంటున్నరు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు చనిపోతే రైతు బీమా ఇచ్చిందన్నారు.
బీజేపీ వాళ్లు కొంటామంటే మనం వద్దు అంటున్నమా..జూటా ప్రచారం గొంతు పెద్దగా చేసి మాట్లాడతున్నారు. గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలు పెంచి నడ్డి పేదల విరుచుడు తప్ప ఏం చేసిండ్రు అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు రైతుల మీద కారు ఎక్కిస్తే అరెస్టు చేయలే మీరా రైతులు కోసం మాట్లాడేదని ఘటుగా విమర్శించారు.
మనం చివరి వరకు పోరాడాల్సిందే..
రైతుల బతుకు బాగవ్వాలంటే బీజేపీని దించాల్సిందే. ఎరువుల ధర పెంచారు. బాయిల కాడ మీటర్లు పెడతామంటారు. జీఎస్టీ మల్ల. ఇలా చేస్తే రైతులు బాగుపడతరా.. రైతులు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందే. అందుకు పోరాటం చేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.