ప్రధాని మోదీనా? అదానీయా?
ఎన్నికల్లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో మోదీ
పట్టణాల్లోనూ ఉపాధి హామీ తేవాలి
కార్మిక చట్టాల్ని రద్దు చేసేదాక పోరు
కాజీపేట ‘కార్మిక ధర్మయుద్ధం’ సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వరంగల్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, కార్మిక హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికులతో రోజుకు 12 గంటలు పనిచేయించేలా చట్టాలు మారుస్తున్నదని మండిపడ్డారు. కార్మికుల చెమట చుక్కలకు విలువ కట్టని ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రధాని మోదీ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ దేశంలో ఉంటే ఎలక్షన్ మోడ్లో లేకుంటే ఎరోప్లేన్ మోడ్లో ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు ‘కార్మిక చైతన్య మాసోత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలో మంగళవారం ఏర్పాటుచేసిన ‘కార్మిక ధర్మయుద్ధం’ సభలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. పేదలు ఎక్కువగా ఉన్న దేశంలో వారిని దోపిడీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
మోదీ ప్రభుత్వరంగ సంస్థలను తన స్నేహితుడు అదానీకి కట్టబెడుతున్నారని, అసలు దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారా? అదానీ ఉన్నారా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తూ, సమస్త రంగాల కార్మికులకు రక్షణగా నిలుస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుతున్నదని, ఆటో రిక్షాలకు పన్ను మినహాయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని చెప్పారు. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామీణ ఉపాధిహామీ తరహాలోనే పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోనూ ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని, తెలంగాణ తరహా పథకాలు కావాలని దేశ ప్రజలు కోరుకొంటున్నారని వివరించారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్తున్నదని దుయ్యబట్టారు. కార్మికుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, మిగిలిన ఎమ్మెల్యేలు ఇలాంటి వాటిని చేపడితే బాగుంటుందని అన్నారు.
కార్మిక సంక్షేమమే ధ్యేయం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్నదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యువతకు ఉపాధి కోసం సీఎం కేసీఆర్ వరంగల్లో టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ దయ వల్ల వరంగల్ ఉమ్మడి జిల్లాలో లక్ష ఉద్యోగాలను అందించే టెక్స్టైల్ పార్కు వచ్చిందని అన్నారు. సభలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేశ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.