హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు బీసీలకు వ్యతిరేకి అని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ రాష్ట్ర కో-కన్వీనర్ బాలకృష్ణ ధ్వజమెత్తారు. తొమ్మిదేండ్లలో బీసీలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనతోనే బడుగులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. బీసీలకు ఇన్నేండ్లలో బీజేపీ ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇప్పటివరకు బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయలేదని, బీసీ జన గణన చేట్టలేదని, బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాలు ఇలా ఏ ఒక్క అంశంలోనూ బీసీలకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దేశంలో ఎకడా లేనివిధంగా రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు దేశమే ఆశ్చర్య పోయేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. నాయీబ్రాహ్మణులకు ఉచిత కరెంటు, బీసీలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నైపుణ్య శిక్షణ తదితర పథకాలను ఉదహరించారు. నాయీబ్రాహ్మణులు కోరుకున్న చోటే ప్రభుత్వం ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నదని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది నాయీబ్రాహ్మణ నేతలు, బీజేపీ తొత్తు తీన్మార్ మల్లన్నతో కలిసి కేసీఆర్ పాలనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం కులం చిచ్చుపెట్టాలని చూస్తే సహించబోమని తీన్మార్ మల్లన్నను హెచ్చరించారు.