సంగారెడ్డి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ నిధులు ఇవ్వటం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మోదీ సర్కార్కు అదానీ, అంబానీల సంక్షేమమే ముఖ్యమని ఆరోపించారు. బీసీల కోసం కేంద్రం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని చెప్తూ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం రూ.2 వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయించిందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన హరీశ్రావు కోహిర్ మండలం బడంపేట రాచన్నస్వామి జాతరలో పాల్గొన్నారు.
అనంతరం కంది మండలం మామిడిపల్లిలో కురుమ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. సంగారెడ్డి పట్టణంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహించిన కురుమ సంఘం సభలో హరీశ్రావు ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కురుమలను పూర్తిగా పట్టించుకోలేదని విమర్శించారు. కురుమల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఒక్కరే పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన సంగతిని గుర్తు చేశారు. శ్రీరామ నవమి తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు చెప్పారు. అంతేగాక రెండో విడత గొర్రెల పంపిణీ కోసం యూనిట్ ధరలను పెంచినట్టు తెలిపారు.
హైదరాబాద్లో కురుమ ఆత్మగౌరవ భవనం
గతంలో ఏ ప్రభుత్వమూ కురుమలకు హైదరాబాద్లో జానెడు జాగా కూడా ఇవ్వలేదని, కేసీఆర్ సర్కార్ రూ.300 కోట్ల విలువ చేసే ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తున్నట్టు హరీశ్రావు చెప్పారు. ఇటీవలే తనతో పాటు కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం హైదరాబాద్లో నిర్మాణమవుతున్న భవనాన్ని పరిశీలించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లతో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. కురుమ నాయకుడు సంపత్కు కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవిని ఇచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తరఫున కురుమలకు రాజకీయ అవకాశం కల్పించనున్నదని భరోసా ఇచ్చారు.
ఎగ్గేమల్లేశ్ను చంద్రబాబు వాడుకొని వదిలేశారు
కురుమ జాతి అభివృద్ధి కోసం పనిచేస్తున్న కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశ్ను టీడీపీ అధినేత చంద్రబాబు వాడుకొని వదిలేశారని మంత్రి హరీశ్రావ్ విమర్శించారు. టీఆర్ఎస్లోకి వస్తే ఎమ్మెల్యే, మంత్రి పదవులు దక్కుతాయని చెప్పినా మల్లేశ్ స్పందించలేదని తెలిపారు. అలాంటి ఎగ్గే మల్లేశ్కు పదవి ఇచ్చి గౌరవం సమకూర్చిన ఘనత కేసీఆర్ది అని చెప్పారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ కురుమల కోసం కేసీఆర్ చేస్తున్న కృషిని అభినందించటంతో పాటు సన్మానం చేశారని చెప్పారు. కేసీఆర్ను సన్మానించినందుకు ఏఐసీసీ నోటీసులు ఇచ్చినా రేవణ్ణ పట్టించుకోలేదని గుర్తుచేశారు.
కురుమల కోసం కేసీఆర్ కృషి
ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని రాష్ట్ర కురుమల సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తున్న కురుమ భవన్ త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం, బీరయ్యయాదవ్, ఐసీ మోహన్, డాక్టర్ శ్రీహరి, జిల్లా అధ్యక్షుడు బూరగడ్డ నగేశ్, జిల్లా నాయకులు కిష్టయ్య, తాటిపల్లి పాండు, మీనాక్షి సాయికుమార్, కార్పొరేటర్ పుష్పానగేశ్, కురుమ యువత అధ్యక్షుడు కొల్కూరి ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మితో తగ్గిన బాల్య వివాహాలు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంతో బాల్యవివాహాలు తగ్గిపోయాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారికే కల్యాణలక్ష్మి పథకం వర్తించటం వల్ల బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. సామాజికంగా ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఎకరం పైగా ప్రభుత్వ భూమిని అందచేయటంతోపాటు రూ.2 కోట్లతో కురుమ ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నట్టు చెప్పారు. త్వరలో మెదక్లో కూడా కురుమ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.