గజ్వేల్ రూరల్, డిసెంబర్ 19: రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు కల్లాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈజీఎస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నదని దుయ్యబట్టారు. సోమవారం ఆయన గజ్వేల్లో క్రిస్టి యన్లకు కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. బాయిలకాడ మీటర్లు పెట్టడం లేదని తెలంగాణకు రావాల్సిన రూ.12 వేల కోట్లను కేంద్ర సర్కార్ ఆపిందని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు రూ.40 వేల కోట్లు రాకుండా ఆపి, తెలంగాణ అభివృద్ధ్దిని అడ్డుకుంటున్నదని విమర్శించారు.
తెలంగాణ రైతులపై వ్యతిరేక ధోరణితో ఉన్న బీజేపీకి తప్పకుండా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈనెల 28 నుంచి రాష్ట్రంలోని రైతుల ఖాతాలో రూ.7,600 కోట్ల రైతుబంధు డబ్బులను వేయబోతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ సంక్రాంతి వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నా రు. తెలంగాణలో అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బస్తీ, పల్లె దవాఖానలను ఏర్పాటు చేసిందని అన్నారు. హైదరాబాద్లో వైద్యం పొందేందుకు వివిధ రాష్ర్టాల నుంచి హెలికాప్టర్లో వస్తున్నారని తెలిపారు. నేచర్క్యూర్ దవాఖానను రూ.6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గర్భిణుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.