కోహీర్, జూన్ 8 : బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నదని, ఎన్డీఏ కూటమి ఎన్నో రోజులు అధికారంలో ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ర్టాలకు అన్యాయం చేసిన బీజేపీకి చంద్రబాబు మద్దతు తెలుపడం సరికాదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలకు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీలకు మద్దతు ఇస్తే బాగుండేదని సూచించారు. పూర్తి మెజారిటీ లేని బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించడం కత్తిమీద సాములాంటిదని ఆయన పేర్కొన్నారు.