హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అన్ని రాష్ర్టాల హక్కులను కాపాడాల్సిన కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది. తెలంగాణపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తున్నది. నిధుల కేటాయింపు మొదలు ప్రాజెక్టులకు జాతీయహోదా, ప్రోత్సాహకాల వరకూ పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నది. ఏడేండ్లుగా అనేక సమస్యలను పరిష్కరించడం లేదు. తెలంగాణ ఏ సమస్యను పరిష్కరించాలని కోరినా నై అంటున్నది. ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రతిదానికీ సై అంటూ వరాలు కురిపిస్తున్నది. తెలంగాణ ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోని బీజేపీ పెద్దలు.. ఏపీ లేఖ రాస్తే స్పందిస్తున్నారు.
అడుగడుగునా ఏపీకి కేంద్రం జీ హుజూర్
మరోవైపు ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా జీహుజూర్లు పలుకుతున్నది. ఏ లేఖ రాసినా అటు కేంద్రం, ఇటు కేఆర్ఎంబీ సత్వరమే స్పందిస్తుండటం అందు కు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవసరాలు, డిమాండ్ మేరకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించగానే, అది అన్యాయమంటూ ఏపీ లేఖ రాసింది. అంతే.. అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ను విద్యుత్తు ఉత్పత్తి కోసం నిర్మించారనే విషయాన్ని విస్మరించి విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణకు కేఆర్ఎంబీ హుకుం జారీచేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయాలని కోరుతూ నేరుగా ప్రధానికి, కేంద్రమంత్రికి, కేఆర్ఎంబీకి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి లేఖలు రాసిన కొద్దిరోజుల్లోనే కేంద్రం బోర్డులను నోటిఫై చేయడం గమనార్హం.
మహబూబ్నగర్ జిల్లా ప్రజల దశాబ్దాల దాహార్తిని, సాగునీటి కష్టాలను తొలగించాలని సంకల్పించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రతి సందర్భంలోనూ విషం కక్కుతున్న ఏపీ సర్కారుకు కేంద్రం వంతపాడుతున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మొదటి దశ పర్యావరణ అనుమతుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టీవోఆర్ తీసుకున్నది. రెండోదశకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించేందుకు డీపీఆర్లను కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు, సీడబ్ల్యూసీకి సమర్పించింది. ఆ వెంట నే ఆ పథకానికి అనుమతులు ఇవ్వకూడదంటూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు, ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి, కేంద్ర జల్శక్తిశాఖకు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. కేఆర్ఎంబీకి కూడా ఫిర్యాదు చేసింది. ఏపీ లేఖ రాసిందే తడవుగా కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఏపీ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేఆర్ఎంబీకి లేఖలు రాసి వాకబు చేస్తుండటం విశేషం. ఇలా ప్రతి అంశంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏపీకి వంతపాడుతూ తెలంగాణ హక్కులను కాలరాస్తుండటంపై ఇంజినీర్లు మండిపడుతున్నారు.
కేంద్రం కనుసన్నల్లోనే రివర్ బోర్డులు
కేంద్రమే కాదు విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి రివర్బోర్డులు సైతం పక్షపాత ధోరణిలోనే వ్యవహరిస్తుండటంపై తెలంగాణ ఇంజినీర్లు మండిపడుతున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ, పర్యవేక్షణలో ఎక్కడా వివాదాలు తలెత్తవద్దనే ఉద్దేశంతో ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 85ను అనుసరించి కేంద్రం జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీని ఏర్పాటు చేసింది. ఇరు రాష్ర్టాలను సంప్రదించి, వారు అంగీకరించిన అంశాలను బోర్డు అమలు చేయాలి. కానీ ఆ బోర్డులు రాష్ర్టాల విజ్ఞప్తులపై పట్టింపులేకుండా కేంద్రం కనుసన్నల్లో నడుచుకుంటుడటం గమనార్హం. కేంద్రం ఆదేశాలనే అమలు చేసేందుకు బోర్డులు తహతహలాడు తూ రాష్ర్టాల అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తున్నాయని ఇరు రాష్ర్టాల ఇంజినీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అంశాలను పట్టించుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయించాలని 13వ జీఆర్ఎంబీ సమావేశంలో ఏపీ సర్కారు ప్రతిపాదించగా, తెలంగాణ వ్యతిరేకించింది. అదే అంశాన్ని త్వరలో నిర్వహించబోయే 14వ బోర్డు సమావేశం ఎజెండాలో జీఆర్ఎంబీ చేర్చడం గమనార్హం. ఇలా బోర్డులు ఏపీకో రీతి.. తెలంగాణాకో నీతి అన్న చందంగా వ్యవహరిస్తున్నాయని, నీటి సమస్యలను పరిష్కరించేందుకే బోర్డును ఏర్పాటుచేశారని, అందుకు భిన్నంగా జఠిలం చేస్తున్నారని ఇంజినీర్లు మండిపడుతున్నారు.
రాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు..
సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి 66ః34 నిష్పత్తిని పునఃసమీక్షించాలని 2018 నుంచి డిమాండ్ చేస్తున్నది. పోలవరానికి కేంద్ర జల్శక్తి శాఖ ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీల నీటిని కేటాయించాలని పట్టుబట్టుతున్నది. తాగునీటి కోసం కేటాయించిన జలాల్లో 80% జలాలు తిరిగి నదిలోకే వెళ్తాయని, అందువల్ల కేటాయింపుల్లో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నది. తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన కృష్ణా జలాలను క్యారీ ఓవర్గా పరిగణించి ఆ తరువాతి నీటి సంవత్సరంలో వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని వాదిస్తున్నది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి కృష్ణా నదీ మిగులు జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు మళ్లిస్తున్నదని, ఏపీ అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కుడి కాలువ పనులను నిలుపుదల చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణా బోర్డుకు 70కి పైగా లేఖలు రాసింది. తెలంగాణ కోరినవన్నీ న్యాయబద్ధమైనవి, ట్రిబ్యునళ్లు తేల్చిచెప్పినవే అయినప్పటికీ వాటిలో ఏ ఒక్కదానినీ కేంద్రం పట్టించుకోలేదు.