Foxconn | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతరు.’ అని బీజేపీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఫాక్స్కాన్ విషయంలో రుజువైంది. తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్కాన్ పెట్టుబడి ప్రధాని మోదీ ఘనతగా కేంద్ర మంత్రులు ట్వీట్ చేసి, మరోసారి తమ వక్ర బుద్ధిని చాటుకొన్నారు. మంత్రి కేటీఆర్ కృషితోనే తాము తెలంగాణకు వచ్చామని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ ఇదివరకే స్పష్టం చేసినా.. కేంద్ర మంత్రులు నిస్సిగ్గుగా ఆ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పారిశ్రామిక అనుకూల వాతావరణం, మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోని బడా కంపెనీలన్నీ తెలంగాణ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్కాన్ ముందుకొచ్చింది.
లక్షమందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. మంత్రి కేటీఆర్ కృషి వల్లే తాము తెలంగాణకు వచ్చామని సంస్థ చైర్మన్ యంగ్ లియూ స్పష్టం చేశారు. తనకు సీఎం కేసీఆర్ రూపంలో ఇండియాలో కొత్త స్నేహితుడు దొరికాడని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను తైవాన్కు రావాలని కూడా ఆహ్వానించారు. ఇదంతా తెలిసినా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఫేక్ ప్రచారం మొదలెట్టింది. ప్రధాని మోదీ కృషివల్లే ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నదని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్ గురువారం ట్వీట్ చేశారు. ఈ ఫేక్ ట్వీట్లపై అటు పారిశ్రామిక రంగ నిపుణులు, ఇటు తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఓ వైపు తెలంగాణకు పరిశ్రమలు రాకుండా కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా అడ్డుకొంటూ.. మరోవైపు నిస్సిగ్గుగా కేంద్రం వల్లే తెలంగాణకు ఫాక్స్కాన్ వచ్చిందంటూ ప్రచారం చేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.