హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తయారైంది రాష్ట్ర బీజేపీ నేతల తీరు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో గెలుపుపై ఇప్పటినుంచే పగటి కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే తనదైన పద్ధతిలో గోబెల్స్ ప్రచారానికి బీజేపీ తెరలేపింది. తమ అసత్యాల బాకా బ్యాచ్ను నిద్రలేపి.. సోషల్ మీడియా వేదికగా వికృత పోస్టులను పెడుతూ.. అసత్యాలు ప్రచారం చేస్తున్నది. కనీస విలువలు కూడా పట్టకుండా.. ప్రముఖుల పేర్లు వాడుకుని.. ఫేక్ ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీదే గెలుపంటూ.. ఓ రాజకీయ విశ్లేషకుడు చేపట్టినట్లుగా ఫేక్ ఒపీనియన్ పోల్ను వైరల్ చేశారు. ఒక ఒపీనియన్ పోల్లో బీజేపీకి 69% ఓట్లు వచ్చినట్లు, మరో పోల్లో 60% వచ్చినట్లు, మరో పోల్లో 55% వచ్చినట్లు బిల్డప్లు ఇస్తున్నారు. వాస్తవానికి హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది ఆ పార్టీకే 69% అవకాశం ఉంటే.. 19 ఏండ్లపాటు ప్రజల తమ గుండెల్లో పెట్టుకొన్న గులాబీ జెండాకు ఎంత శాతం రావాలని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు..
ఆడలేక మద్దెల ఓడు అన్న చందాన ఉంది బీజేపీ తీరు. క్షేత్రస్థాయిలో ఎలాగూ బలంలేక.. ప్రజల వద్దకు నేరుగా వెళ్లే ధైర్యం లేక.. సోషల్ మీడియా వేదికగా విషం చిమ్ముతున్నది. అందుకు ఉదాహరణే ఈ ఫేక్ పోల్స్, ఫేక్ సర్వేలు. వాస్తవంగా హుజురాబాద్లో గెలుపు.. ఈటలది కాదు.. అది సీఎం కేసీఆర్ గెలుపు. సీఎం కేసీఆర్ను చూసే కదా.. హుజూరాబాద్ ప్రజలు ఈటలకు ఓటేసింది! సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను చూసే కదా.. ఈటలకు ఓటేసింది? లేదంటే ఈటలకు ఉన్న బలమెంత అంటూ టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాజకీయ భిక్ష పెట్టిన సీఎం కేసీఆర్పైనే ఎదురు తిరగడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. హుజూరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్.. గులాబీ జెండా తప్ప, పార్టీ అభ్యర్థి ఎవరనేది అవసరంలేదని అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే నిరూపితమైందని.. ఇకపైనా ఇదే పునరావృతమవుతుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈటలకు ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే టక్కుటమార విద్యలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఆయన జిమ్మిక్కులకు ఇక్కడ ఎవరూ పడేవారు లేరని, హుజూరాబాద్ ప్రజలు వాస్తవాలను ఆలోచించేశక్తి గలవారని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి.
ఛీ కొట్టినా.. బుద్ధి మారలేదు
బీజేపీకి రాష్ట్రంలో స్థానంలేదని ఇప్పటికే ప్రజలు పలుమార్లు వారి తీర్పుతో స్పష్టంచేశారు. ఎన్నిసార్లు ప్రజలు చీదరించి.. చీత్కరించినా వారి బుద్ధి మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క దుబ్బాక ఫలితాన్ని చూసి అంతెత్తు ఎగిరిన బీజేపీని పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు పాతాళంలో బొంద పెట్టారు. ఇప్పుడు ఓ రాజకీయ నిరుద్యోగిని చేర్చుకున్నంత మాత్రాన… టీఆర్ఎస్ వచ్చిన నష్టమేమీ లేదని ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.