నల్లగొండ, మే 16(నమస్తే తెలంగాణప్రతినిధి): మతోన్మాద ఎజెండాతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పినా.. కరీంనగర్ ఏక్తా యాత్రలో అస్సాం సీఎంతోపాటు బండి సంజయ్ మాటల తీరు మారలేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో సీఎం అభ్యర్థిని తేల్చలేకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నదని అన్నారు. కర్ణాటక పరిణామాలు గమనిస్తున్న తెలంగాణ ప్రజలు రానున్న కాలంలో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధిచెప్తారని హెచ్చరించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ, అధికారం ఇచ్చినా పాలించే సత్తాలేని కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేస్తే తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా చేస్తాయని అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా ఇంకా సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని అధ్వాన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న రాజస్థాన్లో ఆ పార్టీలోని ఒక వర్గం సంగ్రామ యాత్ర, పాదయాత్రల పేరుతో సొంత ప్రభుత్వంపైనే పోరాటం చేస్తున్నదని గుర్తుచేశారు. అంతర్గత కుమ్ములాటలకు మారుపేరుగా మారిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధికారం కోసం పగటి కలలు కంటున్నారని, వారి కలలు కల్లలే అవుతాయని చెప్పారు. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఇద్దరు నేతలు పోటీ పడితే.. తెలంగాణలో 12 మందికిపైగా పోటీలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
కర్ణాటక ప్రజలు బీజేపీని చీకొట్టినప్పటికీ తెలంగాణలో హిందూ ఏక్తాయాత్ర పేరుతో విద్వేష రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటని గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలన్నా సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పారు. విద్వేషాల బీజేపీకి, దిశలేని కాంగ్రెస్కు తెలంగాణలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వంద సీట్లతో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీతో పోరాడుతున్న సీఎం కేసీఆర్తోనే వామపక్షాలు కలిసి నడుస్తాయని తెలిపారు.