హైదరాబాద్, ఫిబ్రవరి 7 : రాజకీయ పబ్బం కోసమే బీజేపీ నేతలు జైభీమ్ నినాదం తెచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాడు జైశ్రీరామ్, ఇప్పుడు జైభీమ్ పేరుతో నాటకాలు ఆడుతున్నదని దుయ్యబట్టారు. దళితులపై ప్రేమే ఉంటే ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో దళితబంధును బీజేపీ మేనిఫెస్టోల్లో చేర్చాలని సవాల్ చేశారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మెతుకు ఆనంద్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్, బీజేపీ నటిస్తున్నాయని, ఆ ట్రాప్లో దళితులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సింగరేణిని ప్రైవేట్పరం చేయటం ద్వారా తెలంగాణ ప్రగతిని అడ్డుకోజూస్తున్నదని, అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సింగరేణికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత బీజేపీదేనన్నారు. వడ్ల కొనుగోళ్లలో రైతాంగాన్ని నిలువునా మోసం చేసిన కేంద్రం, సింగరేణి గనులను వేలానికి పెట్టి రాష్ట్రంపై పగబట్టిందని మండిపడ్డారు. సింగరేణి 4 బ్లాకులను ఓపెన్ ఆక్షన్కు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి, మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి జోషికి లేఖలు రాశారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ అసలు విషయాన్ని పక్కనబెట్టి, రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివా దం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ తన అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పారని, ఇంతమాత్రానికే బీజేపీ నేతలు ఏదో అయిపోయినట్టు ఎగిరెగిరిపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీతో సహా బీజేపీ పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సమీక్షా కమిటీని నియమించారని గుర్తుచేశారు. అంబేద్కర్ను అవమానించినవారికి మంత్రి పదవులిచ్చిన బీజేపీకి అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. రాజ్యాంగ మొదటి సవరణతోనే రాష్ర్టాల భూ హక్కులను కేంద్రం హరించటం మొదలుపెట్టిందని ఉదహరించారు. దళితులపై బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. దళితవ్యతిరేక బీజేపీ ఎత్తుగడలను దళితులు గుర్తిస్తున్నారన్నారు. సవరణలు చేసినా, కొత్త రాజ్యాంగం తెచ్చినా అంబేద్కర్ స్ఫూర్తితోనే జరుగుతుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ దొంగదీక్షలు: మెతుకు ఆనంద్
రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటల్లోని నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. కేంద్రం రాష్ర్టాల హక్కులను హరిస్తున్నదన్న ఆవేదనతోనే రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ వ్యాఖ్యానించారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదన్న అక్కసుతోనే బీజేపీ, కాంగ్రెస్ నేతలు దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్నే తొలగించాలన్న రాజ్నాథ్సింగ్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలా? అని ప్రశ్నించారు.
ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు మాయం : క్రాంతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దళితులకు ఇప్పించే ధైర్యం బండి సంజయ్కు ఉన్నదా? అని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సవాల్ విసిరారు. తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న నీచ చరిత్ర కాంగ్రెస్, బీజేపీదేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న కేంద్రం రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను ఎగ్గొట్టిందని విమర్శించారు.