హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : మునుగోడులో బీజేపీ గెలుపు అసంభవమని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలిసిపోయింది. ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసింది. అందుకే.. ఉపఎన్నికకు ఆ పార్టీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాష్ట్రంలో ఏ మూలన చూసినా కేంద్ర మంత్రులు హడావిడి చేశారు. రోజుకొకరు వచ్చి.. పూటకొక చోట కనిపించారు. ‘ఇక్కడ మోదీ ఫొటో పెట్టలేదు’.. ‘అక్కడ రోడ్లు మేమే వేశాం’.. అంటూ డైవర్షన్ డ్రామాలు నడిపించారు. తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేంద్రం గప్చుప్ అయిపోయింది.
మంత్రులు రాష్ట్రానికి రావడం మానేశారు. రాష్ట్ర నేతలే కాలికి బలపం కట్టుకొని మునుగోడులో తిరిగారు. దీంతో అధిష్ఠానం ‘కాడి వదిలేసిందని’ పార్టీ నేతలకు అర్థమైంది. ఓవైపు రాజగోపాల్రెడ్డికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ కనిపించకపోవడం, మరోవైపు అధిష్ఠానం సీరియస్గా తీసుకోకపోవడంతో ఓటమి ఖాయమని బీజేపీ రాష్ట్రనేతలకూ ముందే తెలిసిపోయింది. ఓ సందర్భంలో.. ప్రచారానికి రాకున్నా కనీసం ఎన్నికల ఖర్చులకు నిధులైనా ఇవ్వాలని వారు ఢిల్లీ పెద్దలను కోరారట. దీనికి ‘ఓడిపోయే సీటుకు డబ్బు ఎందుకు దండగ?’ అని ముఖం మీదే చెప్పారని సమాచారం. పైగా.. ‘ఖర్చంతా తానే పెట్టుకుంటానని రాజగోపాల్ రెడ్డి చెప్పాడు కదా?’ అని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది.
పరువు పోగొట్టుకోవడం ఎందుకని..
మునుగోడులో మునిగేది ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం గుర్తించారు. అందుకే.. గత నెల 31వ తేదీన నిర్వహించాల్సిన బహిరంగ సభకు హాజరు కాలేదు. ‘ఓడిపోయే చోట సభ పెడితే పరువు పోతుంది’ అనే ఉద్దేశంతోనే ఆయన హాజరుకాలేదని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నడ్డా రాకపోయినా ఒకేరోజు 9చోట్ల బహిరంగ సభలు పెడతామని, దీనికి ఢిల్లీ నుంచి ఇద్దరు, ముగ్గురు పెద్దోళ్లు వస్తారని కూడా బండి చెప్పారు. కానీ.. కేంద్ర మంత్రులు గానీ, ఇతర రాష్ర్టాల నేతలుగానీ మునుగోడు వైపు వచ్చేందుకు ఆసక్తి చూపలేదని తెలిసింది.