హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ను బీజేపీ రాజకీయంగా ఎదుర్కోలేకే రాష్ట్ర మంత్రులపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డారు. మొకాబ్లా బహుత్ రంగీన్ హోజాయెగా (అట్లయితే ఘర్ష ణ చాలా ఘోరంగా మారుతుంది) అంటూ ఈ నెల 12న హైదరాబాద్ గడ్డపై ప్రధాని మోదీ ప్రకటించిన కొద్దిరోజులకే రాష్ట్రంలో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్యాకేజీలపై చర్చిస్తారని ప్రజలు ఆశిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై విషం కక్కారని ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్కు ఉన్న ప్రజాదరణ, సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమను ఢీకొట్టలేక బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతులెత్తేయటంతో.. ఈడీ, ఐటీలను మోదీ ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. దేశంలో 8 రాష్ర్టాల్లో ప్రజాప్రభుత్వాలను కూల్చి బీజేపీ సీరియల్ కిల్లర్గా మారగా, తెలంగాణ మాత్రమే ధైర్యంగా ఎదుర్కోగలిగిందని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎరలో తమకు సంబంధం లేదని బుకాయించిన బండి సంజయ్ యాదాద్రిలో తడిబట్టలతో దొంగ ప్రమాణాలు చేశారని, ఇప్పుడేమో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్ను ఘనంగా కీర్తించటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ యే 8 గంటలపాటు విచారణను ఎదుర్కొన్నారని చెప్పుకొనే బీజేపీ నేతలు.. బీఎల్ సంతోష్ విషయంలో ఎం దుకు డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్ దేవుడో.. దయ్యమో విచారణ సంస్థలే తేలుస్తాయని పేర్కొన్నారు.
ఈడీ, ఐటీ దాడులకు బెదరం
బీజేపీ జేబు సంస్థలుగా మారిన ఈడీ, ఐటీ సోదాలకు బెదరబోమని ఎమ్మెల్యే వివేకానంద్ చెప్పారు. బీజేపీ చేస్తున్న దాడుల వెనుక మతలబు ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ తనిఖీల కోసం 50 బృందాలకు రోజుకు రూ.40 లక్షలను కేంద్రం ఖర్చుచేస్తున్నదని చెప్పారు. బీజేపీ నాయకుల ఇండ్లకు ఈ సంస్థలు ఎందుకు వెళ్లవని ప్రశ్నించారు.