యాదాద్రి భువనగిరి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐని రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ప్రతిపక్ష పార్టీలను ఈడీ, ఐటీ సంస్థలతో వేధించడం తప్ప, ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. బీజేపీలో ఉంటే సుద్ధపూసలు, ఇతర పార్టీలో ఉంటే పాపాత్ములా? అని ప్రశ్నించారు. బీజేపీని నిలదీసి, కేంద్రం తప్పులను కడిగిపారేసిన దమ్మున్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని చెప్పారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆవిర్భావంతో బీజేపీలో వణుకు మొదలైందని, కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలనే కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. అందుకే మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను నిలువరించేందుకు ఎమ్మెల్యేలకు ఎర వేశారని, ఈ కేసులో సంబంధం లేదంటూనే బీజేపీ కోర్టుకు ఎందుకు వెళ్తున్నదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేనట్టు తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడంతో సహనం కోల్పోయిన బీజేపీ.. రాష్ట్రంలో చిచ్చు లేపేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. 12 వేల కోట్లు ఖర్చు చేసి 8 రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీలను కూల్చిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు.