హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది. మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో శివసేన, బీజేపీ కలిసి పోటీచేసాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన నిరాకరించింది. యూపీఏ భాగస్వామి పక్షం శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధపడింది. ఇది బీజేపీకి ఏమాత్రం రుచించలేదు. ఎన్సీపీ అధినేత శరద్పవార్కు వరుసకు సోదరుడైన అజిత్ పవార్తో రాత్రికి రాత్రి బీజేపీ మంత్రాంగం నెరిపింది. బీజేపీ సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్తో గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున రాజ్భవన్లో ప్రమాణం చేయించింది. ఇలా శరద్ పవార్ కుటుంబంలో చిచ్చుపెట్టాలని చూసిన బీజేపీ కుట్రను ఆయన తిప్పికొట్టారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకొనే ప్రసక్తే లేదని శరద్ పవార్ ఎదురుతిరిగి తన సోదరుడితో రాజీనామా చేయించారు. దీంతో నాలుగు రోజుల్లోనే అక్కడి బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది.
బెంగాల్లో బ్లాక్మెయిల్
పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాకుండా బీజేపీ విశ్వప్రయత్నం చేసింది. ఆ పార్టీని బలహీనపరిచి దారికి తెచ్చుకునే వ్యూహం రచించింది. మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్య రుజిరకు బొగ్గు కుంభకోణంలో పాత్ర ఉందని ఈడీతో నోటీసులు ఇప్పించింది. తననేమీ చేయలేక కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నదని మమత మండిపడ్డారు.