హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్.. పైకి బద్ద శత్రువులు. కానీ, వాటి ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విలువలకు వలువలు వదిలేసి ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో లింకులను తవ్వుతుంటే బయటపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ తరఫున హైకోర్టులో వాదిస్తున్నది పొన్నం అశోక్గౌడ్. ఈయనదీ కరీంనగరే, కాంగ్రెస్ సీనియర్ లీడర్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్కు సొంత అన్న. రెండు పార్టీల అక్రమ సంబంధానికి ఈ కేసు నిదర్శనంగా నిలిచింది. సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు న్యాయవాది శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్టుగా, నందకుమార్తో గంటలపాటు ఫోన్లో మంతనాలు జరిపినట్టుగా సిట్ విచారణలో గుర్తించిన విషయం తెలిసిందే.
ఇదే విషయమై మూడు రోజులపాటు సిట్ విచారణకు హాజరైన శ్రీనివాస్.. పూజల కోసం సింహయాజికి టికెట్ బుక్ చేశానని మీడియా సాక్షిగా వెల్లడించారు. కూడా ఇచ్చారు. మరోవైపు సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖాలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను పొన్నం అశోక్గౌడ్ వాదిస్తున్నారు. అశోక్గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్గా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో నిందితులకు సహకరించిన, బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి తరఫున కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న అశోక్గౌడ్ వాదిస్తుండటంపై సీనియర్ న్యాయవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండా శ్రీనివాస్ టికెట్ బుక్ చేయబోరని, దొరికిపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక న్యాయవాదిగా తెలియదనుకోవటం అమాయకత్వమే అవుతుందని ఓ సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ సూచనల్లేకుండా అశోక్గౌడ్ వాదిస్తారనుకోవటమూ లేదన్నారు.
ఢిల్లీలో ఫైట్.. గల్లీలో ఫ్రెండ్స్
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఢిల్లీలో మాత్రమే ఫైట్.. గల్లీలో ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉంటున్నది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. రాష్ర్టానికి వచ్చేసరికి ఆ పార్టీల నేతలు ఒకరినొకరు విమర్శించుకోరు. అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకొంటారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ రోజు ఒక అంశంపై విమర్శలు చేస్తే.. తెల్లారి కాంగ్రెస్ మరో కోణంలో అవే విమర్శలు చేస్తుంటది. హుజూరాబాద్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టి, పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరించిన విషయం తెలిసిందే. మునుగోడులోనూ బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాయకులెవరూ సహకరించకపోవటంతోనే కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదని పార్టీ నాయకులే వ్యాఖ్యానించారు. సిట్టింగ్ స్థానంలో అభ్యర్థిని గెలిపించుకొనేందుకు సీనియర్ నాయకులు ఎవరూ ప్రచారానికి రాకపోవటాన్ని ఉదహరిస్తున్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు సిద్ధాంతాలకు పాతరేసి రెండు పార్టీలు ఒక్కటయ్యాయనే విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించి బీజేపీ అడ్డంగా దొరికిపోయినా టీపీసీసీ తప్పుపట్టదు.. వారి చర్యలను ఖండించదు. రెండు పార్టీల పరస్పర అవగాహనకు అనేక ఉదంతాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.