హైదరాబాద్: మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు మొదలైనయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సానుభూతి కోసం చేతికి పట్టీలు కట్టుకుంటారని, ఒకనాడు జ్వరమని చెబుతారని, మరునాడు దాడులు చేశారంటూ ఏడుస్తారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఇలాగే జరిగిందని ఆయన తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో ఫ్లోరైడ్ పూర్తిగా పోయిందని, మునుగోడు ప్రజలు కాంగ్రెస్, బీజేపీల సానుభూతి డ్రామాలు నమ్మవద్దని, నమ్మితే నష్టపోతారని మంత్రి హెచ్చరించారు. వచ్చే సాధారణ ఎన్నికల లోపు మునుగోడు అభివృద్ధిలో మార్పు చూపించకపోతే అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు వాళ్లపై వాళ్లే దాడులు చేయించుకుని ఏడుస్తారని మంత్రి ఆరోపించారు.
ఓటర్ల సానుభూతి కోసం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి జ్వరం డ్రామా ఆడుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ఏడుస్తూ సింపతి కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి తలసాని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా మునుగోడులో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. మునుగోడులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అన్ని పథకాలు అందాయని చెప్పారు.
మునుగోడు పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ఇక సెంటిమెంట్ రగిలించడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెడుతుందని మంత్రి ఆరోపించారు. అయితే, తాము కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్ళం కాదని, కుట్రలు, కుతంత్రాలు తమకు అవసరం లేదని చెప్పారు. కాగా, ప్రెస్మీట్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, MLC లు ప్రభాకర్ రావు, ఎగ్గె మల్లేశం, MLA లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, TRS రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.