హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రచేసి అడ్డంగా దొరికిపోయిన బీజేపీ.. మరో మూడు రాష్ర్టాల్లోనూ ఇదే తరహా కుట్రకు పావులు కదిపినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు అధికారవర్గాలు తెలిపాయి. మోదీ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్తో స్నేహపూర్వకంగా ఉంటూనే.. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. కొద్ది రోజులుగా నిందితులను విచారిస్తున్న సిట్ వారి వాంగ్మూలాలను వీడియో రికార్డింగ్ ద్వారా భద్రపరుస్తున్నది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సిట్ దర్యాప్తులో బయటపడిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి తెచ్చి.. ప్రభుత్వాన్ని కూల్చడానికి వీలైనంతమంది ఎమ్మెల్యేలకు ఎరవేయాలని ప్రణాళిక రచించినట్టు నిందితులు అంగీకరించినట్టు సమాచారం. నిజానికి బీజేపీ ఏపీలో ఒక్క సీటు గెలవలేదు. కానీ వైఎస్సార్సీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను కొనడానికి పన్నాగం పన్నారని తెలిసింది. వారిలో 55 మంది ఇప్పటికే బీజేపీ బ్రోకర్ల టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. ఓ పక్క జగన్మోహన్రెడ్డిని ఆప్యాయంగా కౌగిలించుకొంటూనే.. మరోపక్క అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పన్నాగం పన్నినట్టు నిందితులు దర్యాప్తు అధికారులకు చెప్పినట్టుగా సమాచారం.
డబ్బు సంచులతో దండయాత్ర
కోట్లు ఖర్చు పెట్టాలి.. ఎమ్మెల్యేలను కొనాలి.. ప్రభుత్వాలను కూల్చాలి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి.. దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న అనైతిక సిద్ధాంతం ఇదే. రాజ్యాంగం లేదు, మిత్ర ధర్మం అంతకన్నా లేదు. రాజకీయ దురాశతో రాష్ర్టాలపై డబ్బు సంచులతో దండయాత్ర చేస్తున్నది. కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేస్తున్నది. ఇప్పటికే 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి, అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్నది. ఇందుకోసం బీజేపీ చేసిన ఖర్చు అక్షరాల రూ.12,515 కోట్లు.
ఇంత భారీ మొత్తంతో 171 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. అయినా అధికార దాహం తీరడం లేదని సిట్ దర్యాప్తులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. తాము ఏయే రాష్ర్టాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రణాళిక రచించామో నిందితులు అధికారులకు పూసగుచ్చినట్టు వివరించారని విశ్వసనీయ సమాచారం. ఈ వివరాల ప్రకారం ప్రధానంగా ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్పై బీజేపీ పడగ విప్పింది. ఒక్కో ఎమ్మెల్యేకు స్థాయిని బట్టి రూ.50-100 కోట్లు ఆశ జూపాలని వీరు నిర్ణయించినట్టు సమాచారం. ఆయా రాష్ర్టాల నుంచి సుమారు రూ.15 వేల కోట్లతో 134 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జాబితా సిద్ధం చేసినట్టు నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. ఇందులో ఏపీలో 55, ఢిల్లీలో 43, రాజస్థాన్లో 21 మందితో బేరసారాలు ప్రారంభించినట్టు సమాచారం.
మిత్రద్రోహం
ఒకప్పుడు మిత్ర ధర్మానికి మారుపేరుగా ఉన్న బీజేపీ ఇప్పుడు కపటబుద్ధిని ప్రదర్శిస్తున్నది. రాజకీయ దాహంతో తన మిత్రులను కూడా బలి తీసుకుంటున్నది. పలు రాష్ర్టాల్లో ఆయా అధికార పార్టీలతో స్నేహంగా ఉంటూనే ఆ ప్రభుత్వాలను కూల్చి వేసే కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తరహా అస్ర్తాన్ని ఆంధ్రప్రదేశ్పైనా వినియోగిస్తున్నది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంచి సంబంధాలు నెరుపుతూనే వెనుక నుంచి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నట్టు తెలుస్తున్నది.