హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అసాధారణ స్థాయిలో డబ్బు కట్టలు వెదజల్లుతున్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలటంతో ప్రజలను ఎలాగైనా తనవైపు తిప్పుకొనేందుకు కోట్లకొద్దీ డబ్బును నియోజకవర్గానికి తరలించారు. ఏకంగా తన సొంత కంపెనీ సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెట్ అధికారిక అకౌంట్ల నుంచే కోట్లకొద్దీ డబ్బు వెళ్లటం మునుగోడులో బీజేపీ బరితెగింపునకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకపక్క బీజేపీ ప్రజల దృష్టిని మళ్లించేలా టీఆర్ఎస్సే డబ్బులు పంచుతున్నదని ఫిర్యాదులు చేస్తుండగా.. రాజగోపాల్రెడ్డి తన సొంతకంపెనీ నుంచే కోట్లకొద్దీ డబ్బు మునుగోడు నియోజకవర్గానికి తరలిస్తున్నారు. సుశీ ఇన్ఫ్రా నుంచి ఈ నెలలో మూడు దఫాలుగా బదిలీ అయిన రూ.5.22 కోట్లు మొత్తం బీజేపీ నాయకుల ఖాతాల్లోకే వెళ్లటం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీపై కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం, రాజగోపాల్రెడ్డి వ్యవహారాలపై మాత్రం చూసీచూడనట్టు వెళ్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుశీ ఇన్ఫ్రా నుంచి డబ్బు బదిలీపై టీఆర్ఎస్ పక్కా ఆధారాలతో శనివారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతిని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారికి, కేంద్రం నియమించిన జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్, పోలీసు అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, డిస్ట్రిక్ట్ ఎలక్ట్రోరల్ అధికారి, రిటర్నింగ్ అధికారులకు పంపారు.
మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మొత్తం 23 బ్యాంకు ఖాతాలకు వెళ్లిన రూ.5. 22 కోట్లను ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసమే బదిలీ చేశారని ఆరోపించారు. డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాదారులతో సుశీ ఇన్ఫ్రాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుశీ ఇన్ఫ్రా నుంచి డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయాలని, ఖాతాల్లోని సొమ్మును ఈసీ స్వాధీనం చేసుకోవాలని సోమ భరత్ కోరారు.
సుశీ ఇన్ఫ్రా నుంచి నిధులు వెళ్లినవారి వివరాలు పరిశీలిస్తే
అంతా బీజేపీ లోకల్ లీడర్ల ఖాతాల్లోకే..
సుశీ ఇన్ఫ్రా ఖాతాల నుంచి బదిలీ అయిన సొమ్మంతా మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీ లోకల్ నేతల ఖాతాల్లోకే వెళ్లినట్టు తేలింది. నిధులు పొందినవారు వందల్లో ఉన్నారని సమాచారం. ఇప్పటివరకు కొంత మంది పేర్లు, వివరాలే బయటకు వచ్చాయి. మరికొంత మందికి సుశీ ఇన్ఫ్రా నుంచి కాకుండా ఇతర కంపెనీల నుంచి కూడా నిధులు వెళ్లినట్టు సమాచారం.