యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ప్రచారం వదిలి దాదాగిరీకి దిగారు. మునుగోడులో ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతున్నరు. ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నిస్తున్న ఓటర్లను ‘ఏయ్ నీ సంగతి చెప్తా’ అని అల్టిమేటం జారీ చేస్తున్నరు. ఓట్లప్పుడే గుర్తుకొచ్చామా? అని అడిగినందుకు తొక్కిఇడ్శిపెడ్తం బిడ్డా.. అని గూండాయిజం చేస్తున్నరు. ప్రచారంలో ప్రశ్నించినవారిపై రౌడీయిజం చేశారు. ఏకంగా ప్రజానీకాన్ని గన్మెన్లతో కొట్టించే ప్రయత్నం చేశారు.
గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనపై ప్రజలు తిరగబడుతున్నారు. గ్రామాల్లోకి అడుగుపెట్టనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా అడ్డగింతలు, నిరసనలు, నిలదీతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఏకంగా ఐదు చోట్ల అడ్డిగించి ఏకిపారేశారు. దీంతో ఏం చేయలేక జనంపై దాదాగిరీ చేస్తున్నారు. రెండు వారాలుగా ఇదే విధం గా నిరసన పర్వం కొనసాగుతున్నది. రాజగోపాల్రెడ్డితోపాటు ప్రచారానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యేను సైతం వదిలిపెట్టలేదు. గత ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి గాలికొదిలేయడం, బీజేపీకి రూ.23 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోవడంతో జనం ఆక్రోశంతో కడిగిపారేస్తున్నారు.
రాజగోపాల్ తీరుతో మునుగోడు ప్రజలు విసిగిపోయారు. ఎన్నికల్లో ఎప్పుడు ఓడగొడుదామా అన్న కసితో ఉన్నారు. గ్రామాలకు ప్రచారానికి వస్తున్న రాజగోపాల్ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఐదు చోట్ల వేర్వేరుగా ఘోర పరాభవం ఎదురైంది. మహిళలు, రైతులు, యువత బీజేపీ అభ్యర్థిని అడ్డగించారు. ఉదయం నారాయణపురం మండలంలోని గుజ్జలో అడ్డుకొన్నారు. మునుగోడులో గెలిపిస్తే అభివృద్ధి చేస్తావని నమ్మితే.. అమ్ముడుపోయావని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత ఇదే మండలం కోతులారంలో నిలదీశారు. కుర్చీ వేసుకుని అభివృద్ధి చేస్తానని, ఎందుకు చేయలేదని అడిగారు. మూడేండ్లయినా మా ఊరికి ఎందుకు రాలేదని కడిగేశారు. పక్కనే ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావును నిలదీశారు. దుబ్బాకలో గెలిచి ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా అక్కడినుంచి జారుకున్నారు. ఇక కొత్తగూడెం గ్రామంలోని పాత కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలోనూ నిరసనల పర్వం కొనసాగింది. ఇక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
2018 ఎన్నికల్లో రాజగోపాల్ వందల హామీలు గుప్పించారు. గెలిపిస్తే మునుగోడు ప్రజల గోస తీరుస్తానని గొప్పలు చెప్పారు. అబద్ధాలు, అసత్యాలు, మోసపు మాటలతో నెట్టుకొచ్చారు. కానీ, గెలిచాక నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కాంట్రాక్టులు, సొంత పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆఖరికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి సమ యం కేటాయించలేదు. దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటు పడింది. తనను గెలిపిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తానని ప్రగల్బాలు పలికారు. సొంత పైసలతో అభివృద్ధి చేస్తానని ముచ్చట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఊరూరు తిరిగి ప్రత్యేకంగా హామీలు ఇచ్చారు. కుల సంఘాలకు బిల్డింగ్లు, గ్రామాల్లో బడు లు, గుడులు, కమ్యూనిటీ హాళ్లు, వాటర్ ట్యాంక్లు, వాటర్ ఫిల్టర్లు, రోడ్లు, బ్రిడ్జిలు కట్టిస్తానని చెప్పి మరిచిపోయారు. తన ఫౌండేషన్ ద్వారా పింఛన్లు ఇస్తానని చెప్పి గాలికొదిలేశారు. భూనిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తానని మాట తప్పారు. దీంతో కోపంతో రగిలిపోతున్న జనం ఊర్లలోకి రానివ్వడంలేదు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వారాలుగా జనం రాజగోపాల్రెడ్డిపై తిరగబడుతున్నారు. గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. శనివారం ఐదు చోట్ల అడ్డుకోగా, ఈ నెల 13న మునుగోడు మండలంలోని సోలిపురం, గంగోరి గూడెంలో జనం అడ్డగించారు. గెలిచాక ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఎట్ల వస్తారని నిలదీశారు. ఈ నెల 12న చౌటుప్పల్ మండలంలోని ఎర్రగడ్డితండా, అల్లాపురంలో అడ్డుకొని కడిగిపారేశారు. గత నెలలో నాంపల్లి మండలంలోని తుంగపహాడ్లో జనం తిరగబడటంతో తీవ్ర అసహనానికి గురైన రాజగోపాల్రెడ్డి.. ‘కుక్కలు మొరిగితే భయపడను’ అని అనడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నెలలో గణేశ్ మంటపం వద్దకు వస్తే మహిళలు నిలదీయడంతో తోకముడిచి పారిపోయారు.