సూర్యాపేట, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ముఖం చాటేశారు. గత 15 రోజులుగా వలసలతో ఖాళీ అవుతూ వచ్చిన బీజే పీ.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విసిరిన మనీట్రాప్ వికటించడంతో జనంలో పలుచనయ్యింది. బీజేపీ తీరుతో ప్రజల్లో తలెత్తుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ పార్టీ నాయకుడొకరు అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఎటు వెళ్లినా బీజేపీ మనీట్రాప్ గురించే చర్చలు జరుగుతుండటంతో ఇబ్బందికరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. కాగా, ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు క్యాడర్ లేకున్నా ఆయా ప్రాంతాల్లో పర్యటించి మమ అనిపించి వెళ్లారు.
మునుగోడు ప్రచారంలో రోజు మాదిరి గురువారం కూడా టీఆర్ఎస్ ప్రచారాలు జోరుగా సాగగా, బీజేపీ బిక్కమొహం వేసింది. ఎమ్మెల్యేలకు మనీట్రాప్ వ్యవహారాన్ని కవర్ చేసుకొనేందుకే పరిమితం అయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మునుగోడు అభ్యర్థి రాజగోపాల్రెడ్డితోపాటు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ తదితరులు అక్కడక్కడ పర్యటించినా ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి అసహనానికి గురయ్యారు.ప్రచారం చేసే పరిస్థితి లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.
నియోజకవర్గంలో బలం లేక అపసోపాలు పడుతున్న బీజేపీపై మనీట్రాప్ వ్యవహారం భారీ దెబ్బ వేసిందని ఆ పార్టీకి చెందిన నేత ఒకరు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయి బీజేపీలో చేరిన రాజగోపాల్రెడ్డి వెంట కొద్దిమంది మాత్రమే బీజేపీలోకి వెళ్లగా.. చాలామంది టీఆర్ఎస్లో చేరారు. ప్రజల్లో రాజగోపాల్పట్ల ఉన్న వ్యతిరేకతను గుర్తించి మిగతా నాయకులు బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి క్యూకట్టడంతో ఆ పార్టీ దాదాపు ఖాళీఅయింది. దీంతో బయటి ప్రాంతాల నుంచి బీజేపీ నాయకులు స్థానికంగా ఉన్న కొద్దిపాటి కార్యకర్తలతో ప్రచారాలు చేయిస్తున్నారు. మనీట్రాప్ వ్యవహారం బీజేపీని డిఫెన్స్లోకి నెట్టేసిందని ఆ పార్టీ నేతలు లోలోన మథనపడుతున్నారు. టీవీల్లో చూస్తుంటే తమ పార్టీ తప్పు చేసి దొరికినట్టు అనుమానం వేస్తున్నదని, తేలుకుట్టిన దొంగల్లా ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని కిందిస్థాయి నాయకుడొకరు ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తానికి మనీట్రాప్ ఘటనలో బర్బాత్ అవుతున్న బీజేపీకి మునుగోడులో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాకుండాఉన్నది.