న్యూఢిల్లీ, అక్టోబరు 26: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హైదరాబాద్కు వచ్చిన బీజేపీ బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా, డబ్బు సంచులతో సహా పోలీసులకు దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలోనైతే ఇది ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఒక్క ఓటు తక్కువై ప్రభుత్వాన్నే వదులుకున్న వాజ్పేయి బీజేపీకి, రాష్ర్టాల వారీగా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలు కూలుస్తున్న మోదీ బీజేపీకి ఎంత తేడాఅని రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిన ఈ వ్యక్తులు ఎవరు అని ఆరా తీసినప్పుడు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ ఎపిసోడ్లో రామచంద్రభారతి కీలకమైన వ్యక్తి అని చెప్తున్నారు. స్వామీజీగా పేరున్న ఈయన బీజేపీ పరివారంలో అతి ముఖ్యుడు. కేంద్ర అధికార నడవాల్లో ఆయనకు తరచూ కనిపిస్తుంటారని, స్వేచ్ఛగా తిరుగుతుంటారనీ, ఆయనను ఎవరూ అడ్డుకోరని రాజకీయ వర్గాలు తెలిపాయి.
కేంద్రంలో కీలక హోదాలో ఉండి, బీజేపీలో నంబర్- 2 గా చక్రం తిప్పుతున్న ప్రముఖుడికి రామచంద్ర భారతి అత్యంత సన్నిహితుడని, కుడి భుజంలాంటి వాడని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. పోలీసుల సమాచారం చెప్పిన దాని ప్రకారం ఆయన స్వస్థలం ఫరీదాబాద్. ఉత్తర కాశీలో ఉన్న కపిలాశ్రమానికి ఆయన అధిపతి. ఈ కుట్రలో పాలు పంచుకున్న మరో స్వామీజీ పేరు వెంకటనాథ సింహయాజి. తిరుపతిలోనూ, కడపలోనూ మంత్రరాజ మఠం పేరుతో ఆయనకు ఆశ్రమాలున్నాయి. ఈ ఇద్దరు స్వామీజీల వద్దకూ కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రముఖులంతా తరచూ వచ్చి వెళ్తున్నట్టు ఫొటో సాక్ష్యాలున్నాయి. ఇక మూడో వ్యక్తి నందు హైదరాబాద్కు చెందిన వ్యాపారి. బీజేపీ వర్గాలకు సన్నిహితుడు. ఆయన హోటల్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. బండి సంజయ్ తదితర బీజేపీ నేతలందరితోనూ నందు దిగిన ఫొటోలున్నాయి.
టీఆర్ఎస్లో షిండేలను సృష్టిస్తామని, కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే రోజు దగ్గర్లో ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా బహిరంగంగానే చెప్తున్నారు. బెంగాల్, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ తదితర విపక్ష రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలను ముందే గమనించిన టీఆర్ఎస్ అధిష్ఠానం, బీజేపీ నేతల ప్రకటనలపై మొదలే ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే.. బీజేపీ బ్రోకర్లు టీఆర్ఎస్ నేతలను సంప్రదిస్తున్న సంగతి దృష్టికి వచ్చింది. ఈ పథకంలో భాగంగానే… నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ రాష్ట్ర అగ్రనాయకులు, ఢిల్లీకి చెందిన నాయకులు మాట్లాడినట్టు తెలిసింది. ‘మీకు ఏమి కావాలన్నా మేం చూసుకుంటాం. పార్టీ మారండి’ అంటూ వారు ఆశ పెడుతూ వచ్చారు. ఈ ఆఫర్లపై నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అగ్రనేతలకు సమాచారమిచ్చారు. పక్కా ప్రణాళికతో బీజేపీ నేతలను తాము పార్టీ మారుతామంటూ నమ్మించారు. అయినా బీజేపీ నేతలు ముందు జాగ్రత్తగా, తాము నేరుగా రంగంలోకి దిగకుండా స్వామీజీలకు బాధ్యతలు అప్పగించారు. స్వామీజీలైతే ఎవరికీ అనుమానం రాదన్నది వారి నమ్మకం.
మరోవైపు ఒకరిద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో హైదరాబాద్కు చెందిన నందకుమార్ మాట్లాడుతూ వచ్చారు. మొత్తమ్మీద సీన్ ైక్లెమాక్స్కు వచ్చాక… దీపావళి తరువాత మంచి రోజు చూసి కలుద్దామని అందరూ అనుకున్నారు. బుధవారం మంచి రోజు అని, ఆ రోజు కలుద్దామని, స్వామీజీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందే వేసుకున్న పథకంలో భాగంగా… అజీజ్నగర్లో తనకు ఫామ్హౌజ్ ఉన్నదనీ, అక్కడ కలిస్తే ఎవరికీ తెల్వదనీ పైలట్ రోహిత్రెడ్డి వారిని నమ్మించారు. అనుకున్నట్టే బుధవారం సాయంత్రం నలుగురు ఎమ్మెల్యేలూ, నందు మొయినాబాద్లోని ప్రైవేట్ ఫామ్హౌస్కు చేరుకొన్నారు. ఇక రామచంద్ర భారతి ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చి, నేరుగా ఫామ్హౌజ్కు చేరుకోగా, సింహయాజి తిరుపతి నుంచి వచ్చారు. తర్వాత చర్చలు మొదలయ్యాయి. ‘ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 100 కోట్లు అందిస్తాం. ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇస్తాం. మీకు ఏ పదవి కావాలో అది ఇప్పిస్తాం’ అని వారు ఆఫర్ చేశారు. ఎమ్మెల్యేలు వీటికి అంగీకరిస్తున్నట్టుగా నటిస్తూ చర్చను పొడిగించారు. ‘మీరు ఎలాగూ చేరుతున్నారు. అడ్వాన్స్గా నగదు తీసుకోండి. ఆ బ్యాగుల్లో క్యాష్ ఉంది. లెక్కపెట్టుకోండి’ అని కూడా స్వామీజీలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఈ తరుణంలో పోలీసులు రంగం ప్రవేశం చేసి కుట్రను బట్టబయలు చేసారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల కారులో లభించిన బ్యాగులు
మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని అజీజ్నగర్లోని రోహిత్రెడ్డికి చెందిన పీవీఆర్ ఫాం హౌస్
పోలీసులకు ఇక్కడేం పని అన్న స్వామి
పోలీసులు ఫామ్లోకి ప్రవేశించగానే స్వామీజీలు మొదట తత్తర పడ్డట్టు తెలిసింది. ‘పోలీసులకు ఇక్కడ ఏం పని? మీరెందుకు వచ్చారు? మీరెలా సోదాలు చేస్తారు’ అని ఒక స్వామీజీ గట్టిగా అరిచారు. ‘పోలీసులకు ఏం పని అడగడానికి ఆయన ఎవరు? మాకు అన్ని చోట్లా పని ఉంటుంది. ఢిల్లీకి చెందిన ఆయనకు ఇక్కడేం పని అని కనుక్కోవడానికి మేం వెళ్లాం’ అని ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఒక అధికారి నవ్వుతూ చెప్పారు. స్వామీజీలు అక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ కోట్ల రూపాయల డబ్బులు ఎందుకున్నాయి? అనే విషయంపై పోలీసులు వారిని చాలాసేపు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలతో జరిగిన చర్చలు, పోలీసుల ఇంటరాగేషన్లో స్వామీజీలు అనేక కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూలగొట్టిందో వారు కూలంకషంగా వివరించారని తెలిసింది. త్వరలో ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా పతనం కాబోతున్నాయని వారు చెప్పినట్టు భోగట్టా. విశేషం ఏమిటంటే… వారు చెప్పిన విషయాలన్నింటినీ పోలీసులు వీడియో రికార్డు చేశారు. ఇందులో అనేక కీలక సంచలనాత్మక విషయాలున్నట్టు చెప్తున్నారు. ఈ కేసులో బీజేపీ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిందని పోలీసులు పేర్కొన్నారు.
తమకు లభించిన సాక్ష్యాధారాలను బట్టి చూస్తే ఈ కేసులో కేంద్ర హోం మంత్రి అమిత్షా తదితర బీజేపీ అగ్రనేతలపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు.
నాలుగు గంటల ఎవిడెన్స్ రికార్డు
ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని టీఆర్ఎస్ ముఖ్యులు పేర్కొన్నారు. ‘ప్రతిదీ కంప్లీట్గా వీడియో ఫుటేజీ ఉంది. నాలుగు గంటలు ఎవిడెన్స్ రికాైర్డెంది. అదీ హిందీ, ఇంగ్లిషు భాషల్లో . ప్రభుత్వం ఆ సాక్ష్యాలన్నింటినీ ఎక్కడ దాచాలో అక్కడ దాచింది. రోజుకు కొంత చొప్పున ఇక సీరియల్ నడుస్తుంది. బీజేపీ బండారం బయటపుతుంది’ అని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు చెప్పారు. నందు తనకు తెలియదని, దీంతో సంబంధం లేదనీ కిషన్రెడ్డి, బండి సంజయ్ ఎంత మొత్తుకున్నా ఇప్పుడు లాభం లేదు. వాళ్లు ఎన్ని లాజిక్లు చెప్పినా ఇప్పుడు లాభం లేదు. వాళ్ల వాదనలు చూసి, డిఫెన్స్ చూసి జనం నవ్వుకుంటున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మోదీ పతనానికి ఈ సంఘటనే మూలం కాబోతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. కిందపడ్డా తమదే పైచేయి అనే రీతిలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, వారికి నిజంగా తెలివి ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి, తప్పు ఒప్పుకోవడం శ్రేయస్కరమని ఆయన హితవు చెప్పారు.
ట్రెండింగ్లో నాట్ ఫర్ సేల్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బీజేపీ చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ట్విట్టర్లో తెలంగాణ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.అర్ధరాత్రి వరకు తెలంగాణ నాట్ ఫర్ సేల్ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్తో పలువురు వ్యక్తులు, సంస్థల ట్వీట్లు వెల్లువెత్తాయి. తెలంగాణ ఇలాంటి కొనుగోళ్లకు వ్యతిరేకమని, బీజేపీ చర్యలను సహించేది లేదని హెచ్చరిం చారు. దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులను బీజేపీ కొనుగోళ్లకు పాల్పడుతుందంటూ గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతాలను వదిలేసి, ప్రజాప్రతినిధులను ఆంగట్లో సరుకులా కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. అమిత్ షా లావాదేవీ ఫెయిల్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. శభాష్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు తెలంగాణ హీరోలు అంటూ ప్రశంసించారు.