హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబరు 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ… తెలంగాణలోనూ అదే దుస్సాహసానికి ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ పక్షాన హైదరాబాద్లో దిగిన స్వామీజీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే కాకుండా అటు కాంగ్రెస్ నాయకులకు కూడా ఎర వేసినట్టు తెలిసింది. ముందుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అనుయాయుడు నందకుమార్ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డితో సంప్రదింపులు జరిపారు.
ఈ నెల 12-13 తేదీల్లో బెంగళూరు శివారులో ఈ సంప్రదింపులు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీలో ప్రస్తుత మలక్పేట కాంగ్రెస్ నేత, గతంలో టీడీపీ తరఫున కార్పొరేటర్గా వ్యవహరించిన నాయకుడు కూడా ఉన్నట్టు సమాచారం. ముందుగా నందకుమార్తో సంప్రదింపులు పూర్తయిన తర్వాత స్వామీజీలు రంగంలోకి దిగుతారనేది సమాచారం. కాగా మల్రెడ్డి వ్యవహరంలో బేరసారాలు నడిచాయా? లేదా? అనేది మాత్రం తెలియరాలేదు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మల్రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు కాషాయ పార్టీ స్కెచ్ వేసినట్లు సమాచారం.