నర్సింహులపేట, మే 26: బీజేపీ మతాల మధ్య గొడవ పెడుతుంటే, కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొత్తతండాలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్పొరేటర్కు ఎక్కువ ఎంపీకి తక్కువని ఎద్దేవాచేశారు.
దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండీ చేయని అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఎండాకాలం సెలవుల్లో విద్యార్థులు బంధువుల ఇంటికి వెళ్లిన తీరుగా కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు రాష్ర్టానికి వచ్చిపోతున్నారని పేర్కొన్నారు.