జనగామ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగతదని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. సోమవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలోని బీవైజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ తెలంగాణకు ఏం ఒరగబెట్టిందో చెప్పాలి. ప్రాజెక్టులు ఏమైనా ఇచ్చిందా? రాష్ట్ర విజభన చట్టంలోని పొందుపరిచిన హామీలను నెరవేర్చిందా? ఇవేమీ చేయకుండా ఏం ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు, ప్రజల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభుత్వం ఓట్లు అడిగే ముందు రైతు వ్యతిరేక చట్టాలను ఎత్తివేస్తారా.. వడ్లను కొనుగోలు చేస్తారా.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి రిజర్వేషన్లను ఎత్తేస్తారా.. వీటికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ తరువాతే ఓట్లు అడుగడానికి రావాలన్నారు. అనేక నెలలుగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సన్న వడ్లనే రైతులు పండించాలని, దొడ్డు వడ్లు పండిస్తే కొనుగోలు చేయమని చెబుతోందని. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి దొడ్డు వడ్లను కొనుగోలు చేసేలా అవకాశం కల్పించి వారి సత్తా చూపాలన్నారు.
నేడు కేంద్రప్రభుత్వం రైల్వే, జాతీయ రహదారులు, ఎయిర్పోర్టులు, స్టీల్ప్లాంట్లు, పారిశ్రామిక సంస్థలు అమ్మడం, ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని అన్నారు. ఇదే జరిగితే ఆ సంస్థల్లో ఉద్యోగాల్లో ఖాళీలు ఏర్పడినా, కొత్త ఉద్యోగాల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు లేకపోతే నష్టపోయేది ఎవరన్నారు.
బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేసే ధైర్యం లేక పరోక్షంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని చేసే కుట్రను ప్రజలు గుర్తించాలన్నారు. అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఈ ఏడు సంవత్సరాల్లోఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉన్నవి ఎత్తివేసే కుట్ర చేస్తోందని, దీనికి సమాధానం చెప్పాలన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పెద్దాపూర్లో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
Biggboss Season 5 Telugu| రెండో వారం నామినేషన్స్లో ఉన్నది వీళ్లేనా..?