హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి బీజేపీ బొక్క బొర్లా పడిన వైనం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. గతంలో పసిగుడ్డు తెలంగాణ సర్కారును కూలదోసేందుకు చంద్రబాబు చేసిన కుట్రతో రాష్ట్రంలో తెలుగుదేశం కనుమరుగైంది. నాడు టీడీపీకి పట్టినగతే నేడు బీజేపీకి పట్టనున్నదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నాటి ఓటుకు నోటు కేసుతో పోలుస్తూ మాట్లాడుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో తొలుత ఒక ఆడియో బయటకి రాగానే అది మార్ఫింగ్ చేశారని చంద్రబాబు అండ్ కో పెడబొబ్బలు పెట్టింది.
ఆ తరువాత మరిన్ని ఆడియోలు, వీడియోలు బయటకు రావడం మొదలు కాగానే రాత్రిరాత్రికి చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చారు. ఆ తరువాత తెలంగాణలో టీడీపీ క్రమంగా కనుమరుగైపోయింది. రాష్ర్టానికి చెందిన వెర్రి కమలాల చేష్టలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. మనీట్రాప్ అంశం తెరమీదకు రాగానే అడ్డదిడ్డంగా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. కోర్టు రాజకీయ బ్రోకర్లను రిమాండ్కు పంపించకుండా విడుదల చేయడంతో.. శుక్రవారం మధ్యాహ్నం వరకు రంకెలు వేస్తూ టీఆర్ఎస్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బీజేపీ మధ్యవర్తులకు సంబంధించిన ఒక ఆడియో వైరల్ కాగానే కాషాయ నేతల కండ్లు బైర్లు కమ్మాయి. ఓటుకు నోటు కేసులో వచ్చినట్టు ఇంకా ఎన్ని ఆడియోలు వస్తాయి? ఎలాంటి వీడియోలు ఉన్నాయి? ఇంకా ఎన్ని ట్విస్టులు జరుగుతాయో అన్న భయం మొదలైంది.