హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీలకు ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు షాక్ ఇచ్చారు. ఇరుపార్టీలకు చెందిన కార్యదర్శులు బీఆర్ఎస్లో చేరారు. దేశాభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ విజయవంతంగా సాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దార్శనికతే దేశానికి తక్షణావసరం అని భావించిన అనేక పార్టీలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరి నిజమైన దేశప్రగతి పట్ల తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బీడ్ జిల్లా బీజేపీ కార్యదర్శి మయూరి ఖేదర్, ఔరంగాబాద్ జిల్లా ఎన్సీపీ కార్యదర్శి సతీశ్ బచాటే, పూణె విధానసభ మనసే హడప్సర్ అధ్యక్షుడు చంద్రకాంత్ సిమ్లా, పూణె మనసే యువక్ అఘాడికి చెందిన కల్యాణ్కుమార్, మనసేకు చెందిన చిరంజీవి రాంరావ్, జై భగవాన్ మహాసంఘ్ యువ తాలూకా అధ్యక్షుడు పరమేశ్వర్ కేదార్, సర్పంచ్లు మహాదేవ్ జవహరే, శరద్సిర్సాత్, సంజయ్ కేదార్, గణేశ్ జయభాయే, భగవాన్ జయభాయే, విష్ణుసనప్, సంతోష్ బడే, అర్బాజ్ షేక్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు మాణిక కదమ్ తదితరులు పాల్గొన్నారు.