కరీంనగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం దాడికి దిగారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మె ల్యే రసమయికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారం దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో చోటుచేసుకున్నది.
గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి వరకు డబుల్ రోడ్డు వేయాలని కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీల అఖిలపక్షం నేతలు గుండ్లపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఆందోళన చేస్తున్నారు. మానకొండూరులో తొలిపొద్దు కార్యక్రమంలో పాల్గొని బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించేందుకు రసమయి వెళ్తున్నారు. ఆయన కాన్వా య్ను గుర్తించిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు అడ్డగించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ కూడా పరిగెడుతూ దాడికి యత్నించారు. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా కారు వెంట పరుగులు తీస్తూ కొందరు రాళ్లు, కర్రలు విసిరారు. రసమయి పై దాడిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఖండించారు.