కొల్లాపూర్, మార్చి 7: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కొంత నిరాశకు గురైన మాట వాస్తవమేనని తెలిపారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు చరిత్రాత్మక నిర్ణయమన్నారు. నరేంద్రమోదీ బడేభాయి.. రేవంత్రెడ్డి చోటాభాయిలా ఒప్పందం కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు.
ప్రధాని ఇచ్చిన ఎజెండానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్నదని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మతపరమైన స్వేచ్ఛ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వంలో రాజధానికి కూతవేటు దూరంలో జనవాడలో ప్రార్థనా మందిరంపై దాడి జరగడం హేయమైన చర్య అని అభివర్ణించారు. తెలంగాణలో బీసీ కులగణన కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. దేశంలో బీసీ గణన చేయబోమని మోదీ ఓపెన్గా చెప్తున్నారని గుర్తుచేశారు. బీసీలను అణిచివేయడం రామరాజ్యమా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ బీసీలకు 10 శాతం ఉద్యోగాలు లేవని, తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నిలదీశారు. బీఎస్పీ, బీఆర్ఎస్ ఓ లక్ష్యం కోసం పొత్తు పెట్టుకున్నాయని వివరించారు.