సైదాబాద్, జూన్ 18 : సింగరేణి కాలరీస్లో జరుగుతున్న బొగ్గు అవినీతి, అక్రమాల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సింగరేణిలో 49శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ విచారణకు ఆదేశించకపోవడమేంటని ప్రశ్నించారు. సింగరేణిపై తీవ్ర ఆరోపణలు వస్తుంటే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎందుకు స్పందిచడం లేదని నిలదీశారు. చంచల్గూడ జైలులో ఉన్న బాల్క సుమన్ను గురువారం ములాఖత్ అనంతరం సబిత, శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజాగొంతుకగా సమస్యలపై పోరాడుతున్న మాజీ ఎంపీ బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వికృతానందం పొందుతున్నట్టు పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన సుమన్పై పెట్టిన అక్రమ కేసుల సెక్షన్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలిపారు. సింగరేణి కాలరీస్లో 40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినట్టు చూపించి రూ.16 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపించారు. సింగరేణి కాలరీస్ పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాది లక్ష్మ ణ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.