కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
ఎకరం పారలేదంటడు జేపీ నడ్డా
కాళేశ్వరం గ్రోత్ ఇంజిన్ అంటడు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ..
అటు కేంద్ర మంత్రుల ప్రశంసలు..
ఇటు బీజేపీ నాయకుల ప్రేలాపనలు
కుర్చీల కోసం కాంగ్రెస్-బీజేపీ కొట్లాట
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ): బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ పక్క కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణలో పథకాలను పొగిడిపోతుంటే.. బీజేపీ నేతలు మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మోకాళ్ల యాత్ర, సైకిల్ యాత్ర, పాదయాత్ర అంటూ పొర్లుదండాలు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి 200 పడకల జిల్లా దవాఖాన, 50 పడకల ఆయుష్ దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన, 100 పడకల హాస్పిటల్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధిపై బీజేపీ, కాంగ్రెస్ నేతల పోకడలపై విరుచుకుపడ్డారు.
నాడు కండ్లల్లో వత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురుచూస్తే.. నేడు ఇక నీళ్లు చాలు.. ఆపాలని రైతులు కోరే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పరిపాలించినప్పుడు డీబీఎం-38 కాలువలో ఎన్నడైనా నీళ్లు వచ్చినయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదంటూ ఎవరో రాసిచ్చింది చదివిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. భూపాలపల్లికి వచ్చి.. ఇక్కడ డీబీఎం ప్రాంత రైతులను అడిగితే కాళేశ్వరం సంగతి తెలుస్తదన్నారు. చిట్టచివరి టేకుమట్లదాకా పారిన కాళేశ్వరం నీళ్లను రైతులే చూపిస్తరని పేర్కొన్నారు. ‘దమాక్ ఉన్నవాళ్లు మాట్లాడే మాటలేనా ఇవి.. కాళేశ్వరం జలాలతో అద్భుతంగా పండిన పంటలు కనిపించడంలేదా? కాళేశ్వరంలో అవినీతి అని అంటున్నరని పార్లమెంట్లో ప్రశ్నిస్తే.. బిశ్వేశ్వర్ తుడు అనే కేంద్రమంత్రి అవినీతి జరగలేదని తేల్చిచెప్పిన విషయం నడ్డా మరచిపోయారన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టును గ్రోత్ ఇంజిన్ అని, తెలంగాణ సస్యశ్యామలం అయిందంటే.. నడ్డా మాత్రం ఒక్క ఎకరా పారలేదంటడు.. ఇందులో ఎవరి మాట నమ్మాలి.. నడ్డావి ఎంత ఝూటా మాటలు?’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి రైతు డిక్లరేషన్ అని అంటున్నారని.. ఏడేండ్ల కిందటి కాంగ్రెస్ పరిపాలనను ప్రజలు ఇంకా మరచిపోలేదని పేర్కొన్నారు. ఎరువుల బస్తాలకోసం లైన్లో నిలబడిన ఘటనలు.. కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ధాన్యం అమ్మడానికి మార్కెట్ యార్డుల్లో పడిగాపులు గుర్తుకులేవా? అని ప్రశ్నించారు. ఓ పార్టీలో ఓటుకు-నోటు పంచాయితీ ఇంకో పార్టీలో సీఎం సీటుకు- నోటు పంచాయితీ ఉన్నదన్నారు. కర్ణాటకలో సీఎం పదవి.. రూ.2,500 కోట్లు ఇస్తే వస్తదని కర్ణాటక బీజేపీ ఎంపీయే చెప్తున్నాడని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓటుకు నోటు కేసులో ముద్దాయి అని గుర్తుచేశారు.
గిరిజనుల కలను నెరవేర్చిన సీఎం: సత్యవతి రాథోడ్
75 ఏండ్ల గిరిజనుల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన తండాలను నాడు ఎవరూ పట్టించుకోలేదని తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారు ఆత్మగౌరవంతో పాలించుకొనేలా చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమం కోసం రూ.12.56 వేల కోట్లు మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బడ్జెట్లో పెట్టినట్టు వెల్లడించారు. గిరిజన పంచాయతీలకు పరిపాలనా భవనాలు, రోడ్లు నిర్మించుకోనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీసుపై నిషేధం
వరంగల్, మే 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్తగా నియమితులయ్యే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధించినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యశాఖ పనితీరుపై సమీక్షలో మాట్లాడిన మంత్రి హరీశ్.. త్వరలోనే 13వేల వైద్య పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.
నిలదీయకపోతే మోసపోతం:ఎర్రబెల్లి
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఊరకుక్కల్లా మాట్లాడుతున్నారని, వారిని నిలదీయకుంటే మోసపోతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎనిమిదేండ్లలో కేసీఆర్ సారథ్యంలో, హరీశ్రావు నాయకత్వంలో చెరువులు బాగు చేసుకొన్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి హరీశ్రావు ఎన్నిసార్లు వచ్చారో ప్రజలకు తెలియంది కాదని పేర్కొన్నారు. రాహుల్గాంధీ ఇప్పుడు వచ్చి ఏదో చెప్తున్నాడని, మరి 75 ఏండ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.